Asia Cup 2025: ఆసియా కప్ 2025లో యువ సంచలనం అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సూపర్-4 మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరుకోవడంలో అభిషేక్ కేవలం 39 బంతుల్లో 75 పరుగులతో చేసిన మెరుపు ఇన్నింగ్స్ కీలకమైంది. అయితే రనౌట్ రూపంలో అభిషేక్ శర్మ సెంచరీని కోల్పోవడం అభిమానులను నిరాశపరిచింది. అయితే అభిషేక్ శర్మ సెంచరీని మిస్సయినా.. అతని ప్రదర్శనపై సోదరి కోమల్ శర్మ వ్యక్తం చేసిన భావోద్వేగాలు హృదయాన్ని హత్తుకుంటున్నాయి. "నిజాయితీగా చెప్పాలంటే క్రికెట్లో రనౌట్ అవ్వడం కొంచెం బాధ కలిగించింది. అయినప్పటికీ ఆ సెంచరీ లోడవుతోంది. త్వరలోనే అభిషేక్ సెంచరీ చేస్తాడు" అని కోమల్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.
అభిషేక్ అదృష్ట దేవత ఎవరంటే?
కోమల్ శర్మ మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన వెనుక అతని మెంటార్ యువరాజ్ సింగ్ గైడెన్స్ ఎంతో ఉందని వెల్లడించారు. "యువరాజ్ సార్ చెప్పిన సూచనలను అభిషేక్ పాటిస్తాడు. మ్యాచ్కు ముందు, ఆ తర్వాత ఎలా ఆడాలో, ఏం చేయాలో అనే అన్నివిషయాలను యువరాజ్ ఎల్లప్పుడూ అభిషేక్కు తెలియజేస్తుంటారు" అని అభిషేక్ అక్క కోమల్ శర్మ అన్నారు. అలాగే అభిషేక్ శర్మ తన తల్లిని అదృష్ట దేవతగా భావిస్తాడని కోమల్ శర్మ పేర్కొన్నారు. జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేస్తూ.. " మొత్తం జట్టు బాగా ఆడుతోంది. చివరికి మాకు ట్రోఫీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాం. టీమిండియా సభ్యులందరూ అత్యుత్తమంగా రాణించి టైటిల్ గెలవాలని ఆకాంక్షిస్తున్నాం" అని కోమల్ శర్మ అన్నారు.

రికార్డుల రారాజుగా అభిషేక్: యువరాజ్ రికార్డు బ్రేక్!
బంగ్లాదేశ్పై 75 పరుగుల ఇన్నింగ్స్లో అభిషేక్ శర్మ ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారతీయ ఆటగాళ్లలో అభిషేక్ ఆరు సార్లు ఈ ఘనత సాధించి తన మెంటార్ యువరాజ్ సింగ్ను అధిగమించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(13), సూర్యకుమార్ యాదవ్(9) మాత్రమే ముందున్నారు. ఈ ఆసియా కప్ 2025 ఎడిషన్లో ఏకంగా 17 సిక్స్లు కొట్టి, ఒకే టోర్నమెంట్లో అత్యధిక సిక్స్లు సాధించిన ఆటగాడిగా కొత్త ఆసియా కప్ రికార్డును నెలకొల్పాడు.
మ్యాచ్ సారాంశం
బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నప్పటికీ, అభిషేక్ శర్మ (75), శుభ్మన్ గిల్ (29) టీమిండియాకు పవర్ ప్లేలోనే 72 పరుగులు అందించి శుభారంభం ఇచ్చారు. అయితే అభిషేక్ రనౌట్ తర్వాత మిడిల్ ఆర్డర్ త్వరగా ఔట్ కావడంతో ఇన్నింగ్స్ వేగం తగ్గింది. హార్దిక్ పాండ్యా (38), అక్షర్ పటేల్ (నాటౌట్ 10) సహకారంతో భారత్ 168/6 పరుగులు చేయగలిగింది.
లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఓపెనర్ సైఫ్ హసన్ (69) భారత ఫీల్డర్ల దయతో ఏకంగా 4 లైఫ్లైన్స్ అందుకుని పోరాడినా, భారత స్పిన్నర్లు విజయం సాధించారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ (3-18), వరుణ్ చక్రవర్తి (2-29) మధ్య ఓవర్లలో పట్టు బిగించడంతో బంగ్లాదేశ్ 127 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత్ ఫైనల్కు చేరుకోగా, మరో ఫైనల్ బెర్త్ కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు నేడు పోటీపడనున్నాయి.