దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక సూపర్-8 మ్యాచ్లో 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత టీమిండియా యాజమాన్యం మేల్కొంది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ పరాజయం మాత్రమే కాదు.. భారత్ సెమీఫైనల్ ఆశలను కూడా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో జింబాబ్వే, వెస్టిండీస్తో జరగబోయే కీలక మ్యాచ్ల కోసం ప్లేయింగ్ ఎలెవన్లో భారీ మార్పులు చేసేందుకు గౌతమ్ గంభీర్ సేన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అభిషేక్ శర్మకు చరమగీతం?
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కడుపు ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన అభిషేక్ శర్మ.. పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ల్లో కనీసం ఖాతా తెరవలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక పోరులోనూ కేవలం 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో అభిషేక్ స్థానంలో అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

లెఫ్ట్-రైట్ కాంబినేషన్
ప్రస్తుతం భారత టాపార్డర్ అంతా ఎడమచేతి వాటం బ్యాటర్లతోనే (అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ) నిండిపోయింది. ఇది ప్రత్యర్థి జట్ల స్పిన్నర్లకు వరంగా మారుతోంది. ఈ ఏకపక్ష బ్యాటింగ్ ఆర్డర్ను మార్చాలని కోచింగ్ స్టాఫ్ భావిస్తోంది. సహాయ కోచ్ ర్యాన్ టెన్ డోష్చేట్ మాట్లాడుతూ.. "సంజూ శాంసన్ ఓ అద్భుతమైన ఆటగాడు. అతనిని టాపార్డర్లో చేర్చడం వల్ల వ్యూహాత్మకంగా రైట్ హ్యాండ్ - లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ సెట్ అవుతుంది. జట్టులో మార్పుల గురించి రాబోయే రెండు రోజుల్లో చర్చిస్తాం" అని పేర్కొన్నారు.
తిలక్ వర్మ, రింకూ సింగ్ల పరిస్థితి ఏంటి?
కేవలం అభిషేక్ శర్మ మాత్రమే కాదు.. తిలక్ వర్మ, రింకూ సింగ్ ప్రదర్శనలపై కూడా మేనేజ్మెంట్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ ముగ్గురిలో కనీసం ఒకరిని పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. భారీ హిట్టర్గా పేరున్న రింకూ సింగ్ దక్షిణాఫ్రికాపై డకౌట్ అవ్వడం టీమిండియా మిడిలార్డర్ బలహీనతను బయటపెట్టింది.
నాకౌట్ లాంటి తదుపరి మ్యాచ్లు
భారత్ తన తదుపరి మ్యాచ్లను జింబాబ్వే, వెస్టిండీస్తో ఆడాల్సి ఉంది. సెమీస్ చేరాలంటే ఈ రెండు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలవడమే కాకుండా, నెట్ రన్ రేట్ను కూడా భారీగా మెరుగుపరుచుకోవాలి. ఈ క్రమంలో గంభీర్ మార్క్ 'అగ్రెసివ్' నిర్ణయాలు ప్లేయింగ్ ఎలెవన్లో ఉండబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.