టీ20ల్లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఓపెనింగ్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్, అభిషేక్ శర్మ.. ఇలా పలువురు ప్లేయర్ల మధ్య రేసు కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో చోటు దక్కించుకున్న అభిషేక్ శర్మ.. ఓపెనర్ గా బరిలోకి దిగి దూకుడు ప్రదర్శనతో సిరీస్ హీరోగా నిలిచాడు.
ఐదో టీ20లో వరుసగా సిక్సర్లు బాదుతూ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసి మైదానాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ విజయం అనంతరం యశస్వి జైశ్వాల్, శుభమన్ గిల్ తో పోటీపై స్పందించాడు అభిషేక్ శర్మ. తాను జట్టులో ఏ స్థానంలో ఆడాలా అనే విషయమై పోటీ పడట్లేదని అన్నాడు. తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు.

"నిన్ననే బీసీసీఐ నమన్ అవార్డుల్లో జైశ్వాల్, గిల్ ను కలిశాను. మా మధ్య ఎటువంటి పోటీ లేదు. మేం అండర్ 16 నుంచి కలిసి ఆడుతున్నాం. మాకు ఉన్నది ఒక్కటే కల. అది టీమిండియాకు ఆడటం. ఇప్పుడు మేం ముగ్గురం కూడా జాతీయ జట్టుకు ఆడుతున్నాం. ఇంతకన్నా గొప్ప ఫీలింగ్ లేదు." అని అభిషేక్ పేర్కొన్నాడు.
సూర్య సలహా వల్లే ఇదంతా..
కెప్టెన్ సూర్యకుమార్ ఇచ్చిన సలహా తన దూకుడు ప్రదర్శనకు బాగా ఉపయోగపడిందని చెప్పాడు అభిషేక్ శర్మ. "బంతి రావడం నేను బాదడం.. కేవలం అదే పనిలో నిమగ్నమైపోయాను. కనీసం నా స్కోర్ ఎంతో కూడా నాకు తెలీయలేదు. కేవలం సూర్యని ఒక్కటే అడిగా ఏం చేయమంటావ్ అని.. 'వికెట్ పడింది. ఇక నువ్వు కావాల్సినంత సమయం, వీలైనన్నీ బంతులు తీసుకో.. రెచ్చిపో' అన్నాడు.
అతడు చెప్పిన ఆ మాట నాకు బాగా ఉపయోగపడింది. అంతే సెంచరీ బాదేశా. అత్యధిక స్కోర్ ను నమోదు చేశాను. నిజానికి ఆ సమయంలో నేను అత్యంత వేగవంతమైన సెంచరీ వేపు దూసుకెళ్తోన్న సంగతి నాకు తెలీదు." అని అభిషేక్ వెల్లడించాడు.