జింబాబ్వే పర్యటనలో భారత్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన శుభ్మన్ గిల్ బృందం రెండో టీ20లో పంజా విసిరింది. 100 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. విజయంలో యువ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (100; 47 బంతుల్లో, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) ప్రధాన పాత్ర పోషించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 234 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగాడు. శుభ్మన్ గిల్ (77 నాటౌట్; 47 బంతుల్లో, 11 ఫోర్లు, 1 సిక్సర్), రింకూ సింగ్ (48 నాటౌట్; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) సత్తాచాటారు. అభిషేక్తో కలిసి రుతురాజ్ 137 పరుగులు, రింకూతో కలిసి 87 పరుగుల భారీ భాగస్వామ్యాల్ని నెలకొల్పాడు.

అనంతరం ఛేదనలో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ వెస్లీ మధెవెర్ (43; 39 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్ (3/37), అవేశ్ ఖాన్ (3/15) చెరో మూడు వికెట్లతో విజృంభించారు. రవి బిష్ణోయ్ (2/11) రెండు, సుందర్ (1/28) ఒక వికెట్ పడగొట్టారు. కాగా, విధ్వంసకర ఇన్నింగ్స్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న అభిషేక్ శర్మ పలు రికార్డులు బద్దలు కొట్టాడు.
46 బంతుల్లో సెంచరీ సాధించిన అభిషేక్.. వరుసగా మూడు సిక్సర్లతో మూడంకెల స్కోరును అందుకున్నాడు. ఈ క్రమంలో హ్యాట్రిక్ సిక్సర్లతో సెంచరీ చేసిన ఏకైక భారత బ్యాటర్గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు. ఇదే తరహా రికార్డును గిల్ సాధించాడు. అయితే గిల్ హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ బాదాడు. భారత్ తరఫున తక్కువ ఇన్నింగ్స్ల్లోనే తొలి టీ20 శతకం సాధించి బ్యాటర్గా అభిషేక్ రికార్డు నమోదు చేశాడు. అభిషేక్కు ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్లో డకౌటైన విషయం తెలిసిందే.
అలాగే జింబాబ్వేపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్గా అభిషేక్ ఘనత సాధించాడు. ఇక 33 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్ సెంచరీ మార్క్ను తాకడానికి మరో 13 బంతులే తీసుకున్నాడు. టీ20ల్లో అతి తక్కువ బంతులతో అర్ధశతకాన్ని శతకంగా మార్చిన రెండో బ్యాటర్ అభిషేక్ రికార్డులకెక్కాడు. తొలి స్థానంలో రోహిత్ శర్మ (12) ఉన్నాడు. కాగా, టీ20ల్లో వేగవంతమైన శతకం సాధించిన మూడో బ్యాటర్ అభిషేక్.