అభిషేక్ శర్మ (135; 54 బంతుల్లో 7×4, 13×6) ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. సిక్స్ల మోత మోగించడంతో ఆఖరి టీ20లో టీమిండియా 150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తన మెంటార్ యువరాజ్ సింగ్ ను ఉద్దేశించి మాట్లాడాడు అభిషేక్ శర్మ. ప్రత్యర్థి బౌలర్లు 140-150 కన్నా వేగంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు, తన వ్యూహం ఎలా ఉంటుందో తెలిపాడు.
"ఇది నాకెంతో ప్రత్యేకం. దేశం కోసం ఇలాంటి ప్రదర్శన చేయడం ఎప్పుడు గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇంతకుముందు కూడా ఇదే చెప్పాను. నా రోజు వచ్చినప్పుడు నేను తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. నా కెప్టెన్ (సూర్య కుమార్), కోచ్ (గంభీర్) నా నుంచి ఇదే కోరుకున్నారు. అదే విధంగా తొలి రోజు నుంచే నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. నిజంగా ఇది నాకెంతో ప్రత్యేకం. ప్రత్యర్థి బౌలర్లు 140-150కి.మీ కన్నా వేగంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు, వాటిని ఆడేందుకు వాళ్ల కన్నా ఒక సెకను ముందు సిద్ధంగా ఉండాలి. అందుకే బంతిని అంచనా వేసి, నా శైలీలో షాట్లు ఆడాలని అనుకుంటాను. ప్రపంచ స్థాయి బౌలర్ పై (జోఫ్రా ఆర్చర్ పై బాదిన షాట్) కవర్ షాట్ బాదుతుంటే, అది ఎప్పుడూ ప్రత్యేకమైన షాటే. రషీద్ బౌలింగ్ లో బాదిన సిక్స్ లు కూడా నాకు ఎంతో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా స్ట్రెయిట్ డ్రైవ్ బాగా గుర్తుండి పోతుంది. యువరాజ్ సింగ్ (అభిషేక్ శర్మ మెంటార్) ఈ ప్రత్యేక షాట్ గురించే నాతో మాట్లాడారు. ఇప్పుడు నా ఈ ప్రదర్శన చూసి ఆయన చాలా సంతోషించి ఉంటారు. నేను ఎప్పుడూ 15-20 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయాలని ఆయన కోరుకుంటాడు. గౌతీ పాజీ కూడా అదే కోరుకుంటాడు. కాబట్టి ఈ రోజు నా రోజు అని భావిస్తున్నాను. దాన్ని నేను బాగా అమలు చేశానని అనుకుంటున్నాను." అని పేర్కొన్నాడు.

యువరాజ్ సింగ్ కూడా అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ పై స్పందించాడు. "అద్భుతంగా ఆడావ్ అభిషేక్ శర్మ. ఇది కదా.. నిన్ను ఈ విధంగా చూడాలని అనుకున్నాను. ఎంతో గర్వంగా ఉంది." అని హర్షం వ్యక్తం చేశాడు.