జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత యువ ఆటగాళ్లు టీ20ల్లో తమ ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకున్నారు. రెండో టీ20లో శతకంతో చెలరేగిన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ర్యాంకింగ్స్లో దూసుకెళ్లాడు. క్లాసిక్ ఇన్నింగ్స్తో సత్తాచాటిన బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, నయా ఫినిషర్ రింకూ సింగ్ కూడా ర్యాంకింగ్స్లో సత్తాచాటారు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో అభిషేక్ శర్మ 46 బంతుల్లో శతకం సాధించిన విషయం తెలిసిందే. తొలి టీ20లో డకౌటైన అభిషేక్ తర్వాతి మ్యాచ్లో పంజా విసిరాడు.
మొదట నిలకడగా ఇన్నింగ్స్ మొదలుపెట్టిన అభిషేక్ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగి శతకంతో విరుచుకుపడ్డాడు. భారత్ తరఫున వేగవంతమై శతకం సాధించిన మూడో ప్లేయర్గా కేఎల్ రాహుల్ సరసన నిలిచాడు. రెండో మ్యాచ్లోనే మూడంకెల స్కోరు అందుకున్న అభిషేక్ 75వ ర్యాంక్కు దూసుకెళ్లాడు. ఇక 47 బంతుల్లో అజేయంగా 77 పరుగులు చేసిన రుతురాజ్ ఏకంగా 13 స్థానాలు ఎగబాకాడు. 20వ స్థానం నుంచి 7వ ర్యాంక్కు చేరాడు.

బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్-10లో సూర్యకుమార్ యాదవ్తో పాటు రుతురాజ్ చోటు దక్కించుకున్నాడు. సూర్య రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 22 బంతుల్లో అజేయంగా 48 పరుగులు చేసిన రింకూ సింగ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 39 ర్యాంక్లో నిలిచాడు. టాప్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్లో టాప్-10లో అక్షర్ పటేల్ మాత్రమే ఉన్నాడు.
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా (7), అఫ్గానిస్థాన్ బౌలర్ ఫజాల్లా ఫరూకీ (8) ర్యాంకులు మెరుగుపర్చుకోవడంతో అక్షర్ రెండు స్థానాలు కోల్పోయి తొమ్మిదో ర్యాంక్లో నిలిచాడు. కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు కోల్పోయి 11 ర్యాంక్లో కొనసాగుతున్నాడు. టాప్లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఉన్నాడు. మరోవైపు ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో హార్దిక్ పాండ్య అగ్రస్థానాన్ని కోల్పోయాడు. రెండో స్థానానికి పడిపోయాడు. శ్రీలంక స్టార్ ప్లేయర్ హసరంగ టాప్లో నిలిచాడు. అక్షర్ పటేల్ 12వ ర్యాంక్లో కొనసాగుతున్నాడు.