హైదరాబాద్: ఒలింపిక్ పతక విజేత, షూటర్ అభినవ్ బింద్రా సరికొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) కమిటీకి ఛైర్మన్గా వ్వవహారించనున్నారు. పది మంది సభ్యులతో కూడిన ప్యానెల్ను శుక్రవారం క్రీడల మంత్రిత్వశాఖ ప్రకటించింది.
పదిమంది సభ్యులు గల ఈ ప్యానెల్లో దిగ్గజ క్రీడాకారులకు చోటు కల్పించారు. పరుగుల రాణి పీటీ ఉష, బ్యాడ్మింటన్ స్టార్ ప్రకాశ్ పదుకొణె, షూటర్ అంజలీ భగవత్, మహిళా వెయిట్ లిఫ్టర్, సిడ్నీ ఒలింపిక్స్ 2000 కాంస్య పతక విజేత కరణం మల్లీశ్వరి ఎంపికయ్యారు.
2008 బీజింగ్ ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణ పతకం అందించిన అభినవ్ బింద్రాతో పాటు అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ ఖన్నా, పీకే మురళీధరన్ రాజా, రైల్వేస్ క్రీడల సంఘం కార్యదర్శి రేఖా యాదవ్, శాయ్ అధికారి ఎస్ఎస్ రాయ్, క్రీడల సంయుక్త కారద్యర్శి ఇందర్ ధమిజాలు ఉన్నారు.

ప్రస్తుతానికి ఈ ప్యానెల్ ఏడాది పాటు తన పనిచేస్తుంది. ఇందులో భాగంగా టోక్యోలో జరగనున్న 2020, 2024 ఒలింపిక్స్కు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించగల క్రీడాకారులను గుర్తించడం దీని పని. ఈ ప్యానెల్ ఎంపిక చేసిన వారికి ప్రపంచ స్థాయి శిక్షణ, మౌలిక వసతులు కల్పిస్తారు.
దీంతో పాటు స్పోర్ట్స్ మెడిసిన్, కిట్లు అందించి ఆర్థిక అవసరాలు తీర్చనుంది. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఛైర్మన్గా ఈ ప్రాజెక్టుని 2015లో ప్రారంభించింది. అప్పటి ప్యానెల్లో కూడా బింద్రా సభ్యుడిగా ఉన్నాడు.
అయితే రియో ఒలింపిక్స్ నేపథ్యంలో తన ఆటపైనే ఎక్కువ దృష్టి సారించారు. షూటింగ్లో నాలుగో స్థానంలో నిలిచిన బింద్రా ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనురాగ్ ఠాకూర్ ఆ పదవి నుంచి తప్పుకోవడంతో శాయ్ (స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) డైరెక్టర్ ఇంజేటి శ్రీనివాస్ దాని బాధ్యతలను తీసుకున్నారు.