గత నాలుగేళ్లుగా భారత టెస్టు జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం లభించకపోవడంపై బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్లో జట్టులో చోటు దొరికినప్పటికీ తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయితే సాయి సుదర్శన్కు అవకాశం కల్పించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. రంగనాథన్ ఈశ్వరన్ ఒక యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమ్ సెలక్షన్ విధానాన్ని ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సాయి సుదర్శన్ ప్రదర్శనపై విమర్శలు
రంగనాథన్ ఈశ్వరన్ తన ఇంటర్వ్యూలో సాయి సుదర్శన్ ప్రదర్శనను గణాంకాలతో సహా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. "మూడో స్థానంలో నా కొడుకుకు ఆడించి ఉండవచ్చు. సాయి సుదర్శన్పై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. కానీ అతను సాధించిన పరుగులు ఎన్ని? 0, 31, 0, 61... ఈ స్కోర్లకు బదులుగా, నా కొడుకు అభిమన్యుకు అవకాశం ఇచ్చి ఉండవచ్చు" అని అభిమన్యు తండ్రి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తన కొడుకు అభిమన్యుకు ఉన్న అనుభవాన్ని ప్రస్తావించారు. "నా కొడుకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వంటి ఫాస్ట్ బౌలింగ్కు అనుకూలించే పిచ్లపై 30% మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. ఎక్కువసేపు క్రీజులో నిలిచి ఇన్నింగ్స్ను నిర్మించగల ఆటగాడు అభిమన్యు అని అతని దేశవాళీ రికార్డులే చెబుతాయి" అని ఆయన ఘాటుగా వివరించారు.

కరుణ్ నాయర్ ఎంపికపై ప్రశ్నలు
సాయి సుదర్శన్తో పాటు జట్టులో ఆడిన కరుణ్ నాయర్ ఎంపికను కూడా రంగనాథన్ ఈశ్వరన్ ప్రశ్నించారు. "కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో ఎప్పుడూ 4 లేదా 5వ స్థానంలో ఆడేవాడు. అలాంటి ఆటగాడిని అకస్మాత్తుగా మూడో స్థానంలో ఎలా ఆడించారు? 4, 5వ స్థానాల్లో ఆడే ఆటగాళ్లందరూ టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా మారిపోతున్నారు. కానీ నా కొడుకు ఒక స్పెషలిస్ట్ టాపార్డర్ బ్యాట్స్మెన్. అతను ఓపెనర్గా మాత్రమే ఆడగలడు" అని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుపట్టారు.
కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి హామీ
అయితే, భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ తన కొడుకుకు ఆశలు కల్పించినట్లు రంగనాథన్ ఈశ్వరన్ తెలిపారు. "గౌతమ్ గంభీర్ నా కొడుకుతో మాట్లాడుతూ, 'నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు. నీకు తప్పకుండా అవకాశం వస్తుంది. ఒకటి, రెండు మ్యాచ్లతోనే నేను నిన్ను జట్టు నుండి తొలగించే వ్యక్తిని కాదు. నీకు ఎక్కువ అవకాశాలు ఇస్తాను' అని హామీ ఇచ్చాడు" అని తెలిపారు. అభిమన్యు ఈశ్వరన్ దేశవాళీ క్రికెట్లో 103 మ్యాచ్లలో 48.70 సగటుతో 27 సెంచరీలు సహా మొత్తం 7841 పరుగులు సాధించాడు.తన కొడుకు 23 సంవత్సరాల కఠోర శ్రమకు తప్పకుండా ఫలితం లభిస్తుందని రంగనాథన్ ఈశ్వరన్ నమ్మకం వ్యక్తం చేశారు.