
కేప్టౌన్: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ మనసు మార్చుకున్నాడు. అంతర్జాతీయ రిటైర్మెంట్పై తన నిర్ణయం మార్చుకునేది లేదని స్పష్టం చేశాడు. భారత్ వేదికగా అక్టోబర్లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ ద్వారా ఏబీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తాడని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో.. మిస్టర్ 360 నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే అభిమానుల ఆశలను పటాపంచలు చేస్తూ తన నిర్ణయాన్ని వెనక్కు తీసకునేదే లేదంటూ ఏబీ తేల్చి చెప్పాడు. రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేందుకు డివిలియర్స్ నిరాకరించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా దృవీకరించింది.
ఐపీఎల్ 2018 సీజన్ ముగిసిన స్వదేశానికి వెళ్లిన ఏబీ డివిలియర్స్.. ఎవరూ ఊహించని రీతిలో ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్బై చెప్పేశాడు. రోజుల వ్యవధిలోనే తన మనసు మార్చుకున్న ఏబీ.. 2019 వన్డే ప్రపంచకప్లో ఆడాలని ఆశించాడు. కానీ టీమ్ భవిష్యత్ని పట్టించుకోకుండా స్వార్థంగా అతను రిటైర్మెంట్ ఇచ్చేశాడని అప్పట్లో విమర్శించి.. అతని పునరాగమనాన్ని వ్యతిరేకించారు. దాంతో ఏబీ కూడా మౌనంగా ఉండిపోయాడు. ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా పేలవ పరాజయాలతో కనీసం సెమీస్కి కూడా చేరలేకపోయింది.
2019 వన్డే ప్రపంచకప్ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మళ్లీ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీపై పావులు కదిపాడు. అయితే జట్టు వైఫల్యాల కారణంగా కొన్ని రోజులకే డుప్లెసిస్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో ఏబీడీ రీఎంట్రీ మళ్లీ వాయిదాపడింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా టీమ్కి హెడ్ కోచ్గా వచ్చిన మార్క్ బౌచర్.. ఏబీ రీఎంట్రీ కోసం పట్టుబడుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఐపీఎల్ 2021లో ఏబీ అద్భుతంగా ఆడాడు. ఆడిన ఆరు ఇన్నింగ్స్ల్లో 164.28 స్ట్రైక్రేట్తో 207 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో నెం.4, నెం.5 స్థానాల్లో వచ్చి పరుగుల వరద పారించాడు.
ఐపీఎల్ 2021 ప్రదర్శన కారణంగా ఏబీ డివిలియర్స్ టీ20 ప్రపంచకప్ ఆడడం ఖాయమే అనుకున్నారు అందరూ. ఐపీఎల్ 2021 అర్ధంతరంగా రద్దు కావడంతో స్వదేశానికి వెళ్లిన ఏబీడిని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సంప్రదించినప్పటికీ.. తన నిర్ణయంలో ఏ మార్పు లేదని, ఉండదని తేల్చేశాడు. హెడ్ కోచ్ మార్క్ బౌచర్ చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అతనిపైనే గంపెడాశలు పెట్టుకున్న దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులో నైరాశ్యం ఆవహించింది. ఇక ఫాన్స్ అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.