హైదరాబాద్: దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించలేనని తేల్చి చెప్పడంతో క్రికెట్ సౌతాఫ్రికా అతడిని టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఈ మేరకు సోమవారం (డిసెంబర్ 12)న అధికారిక ప్రకటన చేసింది.
ఇది తక్షణమే అమల్లోకి రానుందని కూడా వెల్లడించింది. దాంతో త్వరలో శ్రీలంకతో జరిగే మూడు టెస్టు సిరీస్లో దక్షిణాఫ్రికా కెప్టెన్గా డుప్లెసిస్ బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఈ ఏడాది జనవరిలో హాషీం ఆమ్లా నుంచి టెస్టు కెప్టెన్సీ పగ్గాలను అందుకున్న డివిలియర్స్ గత కొంతకాలంగా మోచేతి గాయంతో బాధపడుతున్నాడు.
కెప్టెన్గా డివిలియర్స్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం ఇంగ్లాండ్తో జరిగిన రెండు టెస్టుల్లో మాత్రమే పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టెస్టు సిరీస్ల నుంచి డివిలియర్స్ గాయం కారణంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో తాత్తాలిక కెప్టెన్సీ బాధ్యతలను క్రికెట్ సౌతాఫ్రికా డుప్లెసిస్కు అప్పగించింది.
కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన డుప్లెసిస్ నేతృత్వంలోని సఫారీల జట్టు ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన మూడు టెస్టుల సిరిస్ను 2-1తో దక్షిణాఫ్రికా గెలిచింది. అంతేకాదు అంతకుముందు న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్ను సైతం డుప్లెసిస్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా 1-0 తో గెలుచుకుంది.
ఈ నేపథ్యంలో డుప్లెసిస్కు శాశ్వతంగా కెప్టెన్సీ అప్పగించానే వాదన వినిపించింది. ఇదే సమయంలో మోచేతి గాయం నుంచి కోలుకుని ఏబీ డివిలియర్స్ టెస్టు కెప్టెన్గా చేయడానికి విముఖత చూపించడంతో డుప్లెసిస్ను శాశ్వత కెప్టెన్సీ బాధ్యతలను క్రికెట్ సౌతాఫ్రికా అప్పగించింది. ఈ సందర్భంగా డివిలియర్స్ మాట్లాడుతూ వ్యక్తి కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని చెప్పాడు.
టెస్టు కెప్టెన్గా రెండు సిరిస్లను తాను మిస్ అయ్యాయని, త్వరలో శ్రీలంకలో జరగబోయే టెస్టు సిరిస్కు అందుబాటులో ఉంటానో లేనో కూడా తెలియదని తెలిపాడు. ఆసీస్తో జరిగిన టెస్టు సిరిస్లో జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని కొనియాడాడు.