హైదరాబాద్: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 33 ఏళ్ల డివిలియర్స్ గత ఆరేళ్లుగా దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్గా ఉన్నారు. అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనుంటున్నట్లు తన నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు తెలిపారు.
ఈ సందర్భంగా డివిలియర్స్ మాట్లాడుతూ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం గొప్ప గౌరవమని అన్నాడు. ప్రస్తుతం జట్టుకు కొత్త కెప్టెన్ అవసరమని, కెప్టెన్ ఎవరైనా తన సంపూర్ణ సహకారం ఉంటుందని డివిలియర్స్ ఈ సందర్భంగా ప్రకటించాడు.

ఇక టెస్టుల్లో, టీ20ల్లో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్గా ఉన్న డుప్లెసిస్కే వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని కూడా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకి సూచించాడు. అంతేకాదు వన్డే, టెస్ట్, టి20 ఫార్మట్లలో ఆడేందుకు సిద్ధమని కూడా ప్రకటించారు. మూడు ఫార్మెట్లలో ఆడటం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉందని భావించిన డివిలియర్స్ ఈ ఏడాది జనవరిలోనే టెస్టు ఫార్మట్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు.
ఇక డివిలియర్స్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ వేదికగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబర్చి గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు టెస్టుల్లో డుప్లెసిస్ కెప్టెన్సీలోని దక్షిణాఫ్రికా జట్టు నిలకడగా రాణిస్తోంది. ఈ నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ బాధ్యతలను కూడా డుఫ్లెసిస్కు ఇవ్వాలని ఏబీ సూచించాడు.