ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. అయిదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై అధికారికంగా ఎలిమినేట్ అయ్యింది. 12 మ్యాచ్ల్లో కేవలం నాలుగు విజయాలే సాధించి ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిచినా తదుపరి దశకు చేరుకోవడానికి ఆ జట్టుకు అవకాశం లేకపోవడంతో ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై నిష్క్రమించింది.
ఈ సీజన్లో ముంబై ప్రదర్శన తీసికట్టుగా సాగింది. ఏ దశలోనూ ముంబై ప్రమాదకరంగా కనిపించలేదు. కెప్టెన్సీ మార్పుతో జట్టులో విభేదాలు ఏర్పడినట్లు మైదానంలో స్పష్టంగా కనిపించింది. నయా కెప్టెన్ హార్దిక్ పాండ్య- మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో జట్టు రెండు గ్రూప్లుగా విడిపోయాయని మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ కూడా పేర్కొనడం గమనార్హం.

అయితే జట్టు పగ్గాలు అందుకున్న హార్దిక్ పాండ్య వైఖరి సీనియర్లు అయిన రోహిత్ శర్మ, బుమ్రాకు ఎందుకు నచ్చలేదో దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ వివరించాడు. హార్దిక్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని చూస్తాడని, అలాగే అహంతో బరిలోకి దిగుతాడని డివిలియర్స్ అన్నాడు. ఈ వైఖరి జట్టులోని సీనియర్లకు నచ్చదని అభిప్రాయపడ్డాడు.
''ముంబై ఇండియన్స్ చాలా నిరాశపరిచింది. ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలని ముంబైకు మద్దతు ఇచ్చా. కానీ క్వాలిఫై కాలేదు. ఆ జట్టుకు ఏమైంది? 2021 సీజన్లో అయిదో స్థానంలో నిలిచింది. 2022లో అట్టడుగున స్థానంలో మిగిలింది. 2023లో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. కెప్టెన్సీ మార్పు గురించి రోహిత్ సానుకూలంగానే స్పందించాడు. ఎంతో మంది సారథ్యంలో ఆడానని, తనకి ఇది కొత్తేం కాదని చెప్పాడు''
''హార్దిక్ పాండ్య కెప్టెన్సీ విధానం సాహసపోతేంగా కనిపిస్తుంటుంది. అది ఛాతిని చూపిస్తూ అహంతో నడిచే వైఖరిలా ఉంటుంది. అది హార్దిక్ సహజమైన శైలినా, కాదా అని నాకు తెలియదు. కానీ, జట్టును అదే మార్గంలో నడిపించాలని అతను భావిస్తున్నాడు. అయితే అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడు ఇది వర్కౌట్ కాదు. దాన్ని వాళ్లు తీసుకోలేరు. గుజరాత్ టైటాన్స్ వంటి యువ టీమ్కు ఇది సరిపోతుంది. అనుభవం లేని ఆటగాళ్లు హార్దిక్ కెప్టెన్సీ స్టైల్ను ఇష్టపడతారు'' అని డివిలియర్స్ అన్నాడు.