
హైదరాబాద్: తన అద్భుతమైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. డివిలియర్స్ ఉన్నపళంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడంతో క్రికెట్ లోకం ఒక్కసారిగా షాక్కి గురైంది.
తాజాగా, డివిలియర్స్ రిటైర్మెంట్పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 'నువ్వు మైదానంలో ఎలా ఉంటావో.. బయట కూడా నీకు 360 డిగ్రీల సక్సెస్ లభించాలి. నిన్ను కచ్చితంగా మిస్ అవుతున్నాం డివిలియర్స్. నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశాడు.
34 ఏళ్ల ఏబీ డివిలియర్స్ మూడు ఫార్మాట్ల నుంచి తాను వైదొలగుతున్నట్లు బుధవారం తన ట్విట్టర్లో ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు. ఈ వీడియోలో డివిలియర్స్ 'తక్షణమే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నా. 114 టెస్టు మ్యాచ్లు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాను. ఇతరులకు అవకాశం ఇచ్చే సమయం ఇది. ప్రస్తుతం నా వంతు వచ్చింది. నేను అలసిపోయానని నిజాయతీగా చెబుతున్నాను. నేను రిటైర్ అవుతున్నా' అని తెలిపాడు.
సచిన్తో పాటు ఐసీసీ, బీసీసీఐ సహా పలువురు మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు డివిలియర్స్ రిటైర్మెంట్పై సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేశారు. 2004 డిసెంబర్లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్తో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు, 141 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన డివిలియర్స్ మొత్తం 50 సెంచరీలు, 137 హాఫ్ సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు సాధించాడు.