హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్లో గాయాలు ఆటగాళ్లను వేధిస్తున్నాయి. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు(ఆర్సీబీ) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఐపీఎల్లో బెంగుళూరుకు చెందిన ఏబీ డివిలియర్స్ కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్లో భాగంగా జరుగుతున్న మూమెంటమ్ వన్డే కప్లో ఏబీ డివిలియర్స్ ఆడాల్సి ఉంది. అయితే బ్యాక్ పెయిన్ కారణంగా డివిలియర్స్ మూమెంటమ్ వన్డే కప్కి దూరమైనట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

గాయం నేపథ్యంలో వైద్యులు డివిలియర్స్కి నాలుగు వారాల పాటు విశ్రాంతి సూచించినట్లు తెలుస్తోంది. నిజానికి సెంచూరియన్లోని సూపర్ స్పోర్ట్ పార్కులో జరిగే మూమెంటమ్ వన్డే కప్లో టైటాన్స్తో జరిగే ఫైనల్స్లో ఏబీ డివిలియర్స్ ఆడాల్సి ఉంది.
అయితే సడన్గా డివిలియర్స్కు బ్యాక్ పెయిన్ రావడంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో డివిలియర్స్ ఐపీఎల్లో పాల్గొనడం అనుమానంగా మారింది. ఇటీవలే ఆసీస్తో ముగిసిన సిరిస్లో భుజానికి గాయం కావడంతో కోహ్లీ కూడా కొన్ని వారాల పాటు ఐపీఎల్ మ్యాచ్లకు దూరమయ్యాడు.
ఈ క్రమంలో బెంగుళూరు జట్టు కెప్టెన్సీ బాధ్యతలను డివిలియర్స్కు అప్పగించాలని ప్రాంఛైజీ నిర్ణయించుకుంది. అయితే ఇప్పుడు డివిలియర్స్ కూడా ఐపీఎల్కి దూరమైతే ఏం చేయాలా అన్న ఆలోచనలో బెంగుళూరు ప్రాంఛైజీ మునిగిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పటికే కేఎల్ రాహుల్ ఐపీఎల్కి దూరమవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.