ప్రస్తుతం క్రికెట్లో బెస్ట్ బ్యాటర్ ఎవరంటే చాలామంది చెప్పే పేరు విరాట్ కోహ్లీ. పొట్టి ఫార్మాట్లో కూడా కోహ్లీ రికార్డులు ఎవరూ బద్దలు కొట్టలేని స్థాయిలోనే ఉన్నాయి. ముఖ్యంగా ఐపీఎల్లో కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఈ లీగులో 237 మ్యాచుల్లో 37.24 సగటుతో ఏకంగా 7263 పరుగులు చేశాడీ స్టార్ బ్యాటర్. వీటిలో ఏడు సెంచరీలు కూడా ఉండటం గమనార్హం.
ఇలాంటి కోహ్లీ తమ లీగుల్లో కూడా ఆడాలని పలు దేశాలు కోరుకోవడంలో తప్పేం లేదు. ఇదే విషయంపై కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ కూడా స్పందించాడు. తాజాగా అతన్ని సౌతాఫ్రికా టీ20 లీగ్ అంబాసిడర్గా నియమించారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన డివిలియర్స్.. ఈ లీగ్లో కోహ్లీని ఆడించడం కోసం కచ్చితంగా ప్రయత్నిస్తానని చెప్పాడు.

'డెఫినెట్గా కోహ్లీ. అతన్ని ఇక్కడ కచ్చితంగా ఆడించాలి. తన అంతర్జాతీయ కెరీర్ అయిపోగానే ఇక్కడకు ఎలాగైనా తీసుకురావడానికి ప్రయత్నిస్తా. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఒక్క సీజన్ ఆడినా చాలు. ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది' అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. వీళ్లిద్దరూ కూడా ఐపీఎల్లో చాలాకాలం కలిసి ఆర్సీబీ తరఫున ఆడారు.
ఐపీఎల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా కూడా కోహ్లీ, డివిలియర్స్ నిలిచారు. వీళ్లిద్దరూ 2016లో గుజరాత్ లయన్స్పై ఏకంగా 229 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అలాగే తన మనసు ఆర్సీబీతోనే ఉందని చెప్పిన అతను.. ఆ ఫ్రాంచైజీలో కోచింగ్ సిబ్బందిలో తను ఉంటానని కచ్చితంగా చెప్పలేకపోయాడు.
'ఆర్సీబీతోనే నా మనసు ఉంది. అక్కడ కోచింగ్ పదవి వస్తుందని ఆశిస్తున్నా. ఆ టీంతో నేను చాలా కాలం ఆడా. బెంగళూరు ఫ్యాన్స్తో నాకు చాలా మంచి బంధం ఉంది. ఇంత కాలం వాళ్లు అందించిన ప్రేమాభిమానాలను మర్చిపోలేను. నేను ఏ గ్యారంటీ ఇవ్వలేను. కానీ ఆర్సీబీ కలర్స్లో మళ్లీ సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటా' అని చెప్పాడు.