హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఎన్నో అంచనాలతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలను పాక్ పేసర్లు చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో పేసర్లు, స్పిన్నర్లు ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అరుదైన ఘనత సాధించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
దక్షిణాఫ్రికా ఓపెనర్లు క్వింటన్ డికాక్ (33), హషీమ్ ఆమ్లా (16) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. 40 పరుగుల వద్ద ఆమ్లాను ఇమాద్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ ఏబీ డివిలియర్స్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 14వ ఓవర్ చివరి బంతికి 60 పరుగులు వద్ద డికాక్ (33)ను మహ్మద్ హఫీజ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.

ఆ తర్వాతి ఓవర్లో పాక్ స్పిన్నర్ ఇమద్ వసీమ్ బౌలింగ్లో తానెదుర్కొన్న తొలి బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ డివిలియర్స్ (0) థర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న హఫీజ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో జట్టు స్కోరు 61 వద్ద ఇమాద్ బౌలింగ్లో డివిలియర్స్ పెవిలియన్కు చేరాడు.
అంతర్జాతీయ వన్డేల్లో దక్షిణాఫ్రికా కెప్టెన్కి ఇదే తొలి గోల్డెన్ డకౌట్ కావడం గమనార్హం. దీంతో 15 ఓవర్లలో 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఆ తర్వాత డుప్లెసిస్ (26), డుమినీ(8), పార్నెల్ కూడా డకౌట్ కావడంతో 118 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులో వచ్చిన డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్తో ఒంటరి పోరాటం చేశాడు.
ఆ తర్వాత కొద్ది సేపటికే క్రిస్ మోరిస్ (28) పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. ఇదే సమయంలో డేవిడ్ మిల్లర్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత రబడతో కలిసి ఇన్నింగ్స్ను నిర్మించేందుకు ప్రయత్నించాడు. అయితే రబడ(26) పరుగుల వద్ద జునైద్ ఖాన్ బౌలింగ్లో పెవిలియన్కు చేర్చాడు. పాకిస్థాన్ బౌలర్లలో హసన్ అలీ మూడు వికెట్లు తీయగా, ఇమాద్ వసీం రెండు, జునైద్ ఖాన్ రెండు, హఫీజ్ ఒక వికెట్ తీశారు.
ఆ తర్వాత 220 పరుగల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ బ్యాటింగ్కు వరుణుడు అడ్డంకిగా మారాడు. మ్యాచ్ ఫలితం తేలకుండా అడ్డు తగిలాడు. దీంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో పాక్ను విజేతగా అంపైర్లు ప్రకటించారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్కు తొలి విజయం లభించింది.
ఆ తర్వాత వర్షం వల్ల ఆట నిలిచే సమయానికి పాకిస్థాన్ 27 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. క్రీజులో బాబర్ ఆజమ్ (31), షోయబ్ మాలిక్ (16) ఉన్నారు. డక్వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం పాక్ స్కోరు 27 ఓవర్లలో 100 పరుగులు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం పాక్ 19 పరుగులు అధికంగా చేసింది. దీంతో 19 పరుగుల (డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) తేడాతో పాకిస్థాన్ విజేతగా నిలిచింది.