
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్రారంభం అయి 10 రోజులు మాత్రమే అయింది. ఉత్కంఠ మ్యాచులు, సూపర్ ఓవర్ల రూపంలో అభిమానులకు అసలైన క్రికెట్ మజాను అందిస్తోంది. సోమవారం రాత్రి కూడా చివరి వరకు ఉత్కంఠంగా జరిగిన పోరులో ముంబై ఇండియన్స్పై సూపర్ ఓవర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచులో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
తాజాగా ఏబీ డివిలియర్స్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకోవడంతో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ టోర్నమెంట్ చరిత్రలో అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్న కరేబియన్ స్టార్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సరసన చేరాడు. గేల్ ఇప్పటివరకు 21 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోగా.. డివిలియర్స్ కూడా అన్నే అందుకుని అగ్రస్థానానికి చేరుకున్నాడు. 157 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన డివిలియర్స్.. 21 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను అందుకున్నాడు. డివిలియర్స్ మూడు సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు చేశాడు.
అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న జాబితాలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 191 ఐపీఎల్ ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్.. 18 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను అతడు అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ కూడా ఐపీఎల్ చరిత్రలో 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను గెలుచుకున్నాడు.
ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డివిలియర్స్ (55 నాటౌట్), ఆరోన్ ఫించ్ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), దేవ్దత్ పడిక్కల్ (40 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సరిగ్గా 201 పరుగులు చేయడంతో మ్యాచ్ 'టై' అయ్యింది. ఇషాన్ కిషన్ (58 బంతుల్లో 99; 2 ఫోర్లు, 9 సిక్సర్లు), కీరన్ పొలార్డ్ (24 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్లు) హాఫ్ సెంచరీలు బాదారు. సూపర్ ఓవర్లో బెంగళూరు అద్భుత విజయాన్ని అందుకుంది.