సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎక్కువగా రెచ్చగొడితే ప్రత్యర్థులు ఎవరనేది చూడకుండా నిర్ధాక్షిణ్యంగా శిక్షిస్తాడని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. తొలి టెస్టులో కోహ్లీతో తలపడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తన సహచరులకు సూచించాడు. సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా కంగారూల గడ్డపై ఉన్న విషయం తెలిసిందే. వన్డే, టీ20 సిరీస్ను ముగించుకుని.. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం తీవ్రంగా సిద్ధమవుతోంది. డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
తాజాగా ఆరోన్ ఫించ్ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రికతో మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీని ఎక్కువగా రెచ్చగొడితే ప్రత్యర్థులు ఎవరనేది చూడకుండా నిర్ధాక్షిణ్యంగా శిక్షిస్తాడు. గురువారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టులో కోహ్లీతో తలపడేటప్పుడు ఆసీస్ ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఇరు జట్ల మధ్యా ఎన్నో ఏళ్లుగా మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు కూడా అలా జరిగే అవకాశం ఉంది. ఇరు జట్లలో ఢీ అంటే ఢీ అనే ఆటగాళ్లుంటే కచ్చితంగా అలాంటివి చోటుచేసుకునే వీలుంది' అని అన్నాడు.
ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా జట్లలో మంచి వాతావరణం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీని రెచ్చగొట్టొద్దని ఆరోన్ ఫించ్ ఆస్ట్రేలియా ఆటగాళ్లను హెచ్చరించాడు. ఒక వ్యక్తిగా మైదానం బయట కోహ్లీ ప్రశాంతంగా ఉంటాడని ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ చెప్పాడు. విరాట్ ఆటను అర్థం చేసుకొని మెలుగుతాడని తెలిపాడు. ఐపీఎల్ 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథిగా విరాట్ కోహ్లీ ప్రణాళికలు చూసి ఆశ్చర్యపోయానని ఫించ్ అన్నాడు. ప్రతి ఆటగాడి పట్ల చాలా నమ్మకంతో ఉంటాడన్నాడు.
సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇప్పటికే పూర్తయిన పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలుపొందగా.. 1-2 తేడాతో టీ20 సిరీస్ కోల్పోయింది.ఇక గురువారం నుంచి రెండు జట్లూ 4 టెస్టుల సిరీస్లో తలపడనున్నాయి. అయితే తొలి టెస్టు తర్వాత టీమిండియా సారథి భారత్కు తిరిగి వస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క శర్మ జనవరిలో తల్లికాబోతున్నందున విరాట్ పితృత్వపు సెలవులు తీసుకున్నాడు.
'హార్దిక్ పాండ్యాలా పాకిస్థాన్ ఆటగాళ్లు ఎప్పుడైనా చేశారా?.. ఓసారి మిరే ఊహించుకోండి'