హైదరాబాద్: కోహ్లీసేనతో జరిగిన మూడు వన్డేల సిరిస్లో ఓటమికి ఎవరూ బాధ్యులు కారని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. మూడు వన్డేల సిరిస్ను 2-1తో చేజార్చుకోవడంపై ఆరోన్ ఫించ్ మీడియాతో మాట్లాడుతూ "పరిమిత ఓవర్లలో ఆడేటప్పుడు ఒకప్పుడు మా బ్యాట్స్మెన్ చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇప్పుడు ఆ సమస్యను మేం దాదాపుగా అధిగమించాం" అని అన్నాడు.
న్యూజిలాండ్ పర్యటనలో సచిన్ రికార్డుకు చేరువలో ధోని
"మూడు వన్డేల్లోనూ బాగానే బ్యాటింగ్ చేశాం. అందులో ఎంతో పురోగతి సాధించాం. బ్యాటింగ్ సమస్యకు ఇప్పుడే సమాధానం దొరుకుతోంది. కెప్టెన్గా ఈ విషయం నన్ను కలవరపెట్టేది. కానీ, టీమిండియాతో జరిగిన మూడు వన్డేల తర్వాత నాకు జట్టుపై కాస్త నమ్మకం ఏర్పడింది. నా బ్యాటింగ్ శైలిలో కూడా మార్పు వచ్చినందుకు సంతోషంగా ఉంది" అని ఆరోన్ ఫించ్ చెప్పుకొచ్చాడు.
"ఆ బౌలర్ లేదా బ్యాట్స్మెన్ కారణంగా సిరీస్ కోల్పోయామనే సమస్య లేదు. మా ఓటమికి ఎవరూ బాధ్యులు కారు. మా జట్టులో ప్రతి ఒక్కరూ బాగానే ఆడారు" అని ఆరోన్ ఫించ్ అన్నాడు. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన ముగియడంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది.
ఈ టెస్టు సిరిస్కు ఆరోన్ ఫించ్ దూరం కానున్నాడు. దీనిపై ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ బ్యాటింగ్ను మరింత మెరుగుపరుచుకోవడానికి తనకో మంచి అవకాశం దొరికిందని, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానని అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది.
డే నైట్ టెస్టుగా జరిగే తొలి టెస్టు జనవరి 24న బ్రిస్బేన్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత రెండో టెస్టు ఫిబ్రవరి 1 నుంచి మెల్బోర్న్ వేదికగా జరగనుంది. కాగా, ఇటీవలే టీమిండియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను ఆస్ట్రేలియా జట్టు 2-1తేడాతో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.