
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ ఆరోన్ ఫించ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక జట్లకు ప్రాతినిథ్యం వహించిన తొలి ఆటగాడిగా ఆరోన్ ఫించ్ గుర్తింపు పొందాడు. శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్-బెంగళూరు జట్లు తలపడుతున్నాయి.
Punjab vs Bangalore 2018 Match 8 Score Card
ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ స్థానంలో ఆరోన్ ఫించ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. తద్వారా ఆరోన్ ఫించ్ ఈ రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఆరోన్ ఫించ్ తర్వాత ఆరు జట్లకి ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్ల జాబితాలో పార్థీవ్ పటేల్, తిసారా పెరీరా, దినేశ్ కార్తీక్లు ఉన్నారు.
ఆరోన్ ఫించ్ తొలిసారిగా 2010లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2011-12లో ఢిల్లీ డేర్ డేవిల్స్, 2013లో పూణె వారియర్స్, 2014లో సన్రైజర్స్ హైదరాబాద్, 2015లో ముంబై ఇండియన్స్ జట్లకు ఆడాడు. ఇక 2016లో ఆరోన్ ఫించ్ను గుజరాత్ లయన్స్ కొనుగోలు చేయగా, గాయంతో ఆ సీజన్కు దూరమయ్యాడు.
ఇక, 2017 సీజన్లో గుజరాత్ లయన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో ఆరోన్ ఫించ్ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ. 6.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, వివాహం కారణంగా ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్కు దూరమైన ఆరోన్ ఫించ్ రెండో మ్యాచ్కు తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.