కరాచీ: ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం మొదలైంది. టోర్నీలో పాకిస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడిందంటూ ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ సారథి అమిర్ సోహైల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి.
దీంతో అందరూ షాక్కు గురయ్యారు. టోర్నీలో భాగంగా పాక్-ఇంగ్లాండ్ మధ్య తొలి సెమీఫైనల్ బుధవారం జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్కు చెందిన ఓ వార్తా సంస్థ చర్చా కార్యక్రమం నిర్వహించింది.
ఇందులో పాల్గొన్న అమిర్ సొహైల్ ఫైనల్ చేరిన పాక్ జట్టుపై ఆరోపణలు చేశాడు. ఇతరుల కారణంగా (జట్టులో లేనివాళ్లు)నే పాక్ టోర్నీలో మ్యాచ్లు గెలిచిందని ఆరోపించాడు.
ప్రస్తుత జట్టు సారథి సర్ఫరాజ్ ఫిక్సింగ్కి పాల్పడ్డాడని అన్నాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం సర్ఫరాజ్ మాట్లాడాడని, జట్టులోని ఆటగాళ్ల కృషి వల్లే విజయం సాధించామని ఎక్కడా చెప్పలేదని, దానిని గమనించాలని సోహైల్ పేర్కొన్నాడు.
తమ విజయానికి ఎవరో సాయం చేశారన్న రీతిలోనే సర్ఫరాజ్ ఎప్పుడూ మాట్లాడేవాడని, దీంతో ఆట వెనుక ఏమి జరిగిందో మేమంతా ఊహించగలమని, జట్టు విజయానికి కారణమేమిటని అడిగినప్పుడల్లా తాము చేసిన ప్రార్థనలు, అభిమానుల మద్దతు, దేవుడి దయ వల్లే అని చెబుతూ వచ్చాడని సోహైల్ అన్నాడు.
బయటి శక్తుల కారణంగానే పాక్ ఫైనల్కు చేరుకుందని తెలిపాడు. ఇప్పటికైనా మించి పోయింది లేదని, ఇక నుంచి క్రికెట్ ఆడండి అని సోహైల్ ఈ సందర్భంగా జట్టును కోరాడు.