
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్.. మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్తో త్వరలో చెస్ గేమ్ ఆడనున్నారు. దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి పోరులో భాగంగా విరాళాలు సేకరించడానికి ఆనంద్తో ఆమిర్ ఓ గేమ్ ఆడనున్నారు. జూన్ 13న (ఆదివారం) సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఈ గేమ్ జరగనుంది. చెస్.కామ్ అనే యూట్యూబ్ చానెల్ ఈ గేమ్ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ మేరకు చెస్.కామ్ తన ట్విటర్లో ప్రకటించింది.
'చాలా రోజులుగా మీరందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. చెస్ లవర్ అయిన సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్, మాజీ వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్తో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ ఈవెంట్ను విజయవంతం చేయడానికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వండి' అని చెస్.కామ్ తన ట్విటర్లో ట్వీట్ చేసింది. విషయం తెలిసిన అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. గేమ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్ అయిన ఆనంద్కు మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఏ మేరకు పోటీ ఇస్తారో చూడాలి.
గతంలోనూ ఆమిర్ ఖాన్, విశ్వనాథన్ ఆనంద్ ఇద్దరూ చెస్ ఆడిన ఫొటోను చెస్.కామ్ ట్వీట్ కామెంట్స్లో ఓ అభిమాని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఈ గేమ్ అద్భుతంగా సాగబోతోందని పలువురు అభిమానులు అభిప్రాయపడ్డారు. ఈ ఈవెంట్కు 'చెక్మేట్ కొవిడ్' అనే పేరు పెట్టారు. కరోనాతో బాధపడుతున్న చెస్ ప్లేయర్స్, వాళ్ల కుటుంబ సభ్యులకు ఈ డబ్బును నిర్వాహకులు అందించనున్నారు. ఆమిర్ ఖాన్తో పాటు ఆ రోజు మరికొందరు సెలబ్రిటీలు కూడా ఆనంద్తో చెస్ ఆడనున్నారని సమాచారం తెలుస్తోంది.
విశ్వనాథన్ ఆనంద్ మూడు దశాబ్దాలుగా భారత చదరంగం చరిత్రలో తనదైన ముద్ర వేశారు. ఆనంద్ 1988లో భారత్ నుంచి తొలి గ్రాండ్ మాస్టర్గా ఎంపికయ్యారు. 2000 నుంచి 2013 వరకు ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆయన 2013లో మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక 2017లో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుపొంది మరోసారి తన సత్తా చాటారు. ఇక ఆమిర్ ఖాన్ తన కొత్త సినిమా 'లాల్ సింగ్ చద్దా' విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.