
ముంబై: ఐపీఎల్ 2021లో మూడు పరాజయాల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తిరిగి విజయాల పట్టింది. ఆదివారం ముంబై ఇండియన్స్ (ఎంఐ)తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 54 పరుగుల తేడాతో గెలుపొందింది. స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (56; 37 బంతుల్లో 6×4, 3×6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (51; 42 బంతుల్లో 3×4, 3×6) మెరవడంతో మొదట ఆర్సీబీ 6 వికెట్లకు 165 పరుగులు సాధించింది. ఆపై హర్షల్ పటేల్ (4/17)కు తోడుగా గ్లెన్ మ్యాక్స్వెల్ (2/23), యుజ్వేంద్ర చహల్ (3/11) చెలరేగడంతో ఛేదనలో ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లు ఒక్కరు కూడా ఆకట్టుకోలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (43; 28 బంతుల్లో 5×4, 1×6) టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్ రెండో బంతినే కోహ్లీ సిక్స్ కొట్టాడు. అయితే అది క్యాచ్ అయినా సిక్స్ వెళ్లింది. కోహ్లీ ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించినా.. ఆ తర్వాత సరైన సమయంలో వేగం తగ్గించాడు. దీంతో టీమిండియా మాజీ బ్యాటర్, స్టార్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా.. కోహ్లీ ఇన్నింగ్స్ను ట్రోల్ చేశాడు. కోహ్లీ తన ఇన్నింగ్స్ను బుల్లెట్ ట్రైన్ లాగా ఆరంబించి.. చివరకు గూడ్స్ ట్రైన్ అయిపోయాడని ఎద్దేవా చేశాడు. ముంబైపై విరాట్ అవసరమైన సమయంలో వేగం తగ్గించాడని, అలా చేసుండకూడదని పేర్కొన్నాడు.
ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ మరో లక్ష్యంతో క్రీజులోకి వచ్చాడు. మొదటి ఓవర్ నుంచే బాదుడు ప్రారంభించాడు. అలాంటి సిక్సర్తో ఎవరూ పరుగుల ఖాతాను తెరవరు. అది దాదాపు క్యాచే. అయితే కోహ్లీ అదృష్టం కొద్ది ఆ బంతి సిక్సర్ వెళ్లింది. రెండో ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా టార్గెట్ చేశాడు. అయితే అతడు దేవదత్ పడిక్కల్ను అవుట్ చేశాడు. ఆపై కేఎస్ భరత్ మరియు కోహ్లీ మధ్య మంచి భాగస్వామ్యం నెలకొంది. కానీ పవర్ప్లే ముగిసిన వెంటనే బెంగళూరు స్కోర్ వేగం తగ్గింది. కోహ్లీ బుల్లెట్ ట్రైన్ లాగా ఇన్నింగ్స్ ఆరంభించి.. షార్జాలో మాదిరిగా అకస్మాత్తుగా నెమ్మదించాడు. అయితే భరత్ మాత్రం భారీ షాట్ ఆడుతూ వచ్చాడు' అని పేర్కొన్నాడు.
'మేం గెలిచిన తీరుపై చాలా ఆనందంగా ఉంది. ఆదిలోనే దేవ్దత్ పడిక్కల్ వికెట్ కోల్పోయి మ్యాచ్ను ప్రారంభించాం. జస్ప్రీత్ బుమ్రా ముంబైకి శుభారంభం అందించాడు. అక్కడి నుంచి మ్యాచ్లో మేము పుంజుకున్నాం. నాతో పాటు శ్రీకర్ భరత్ బాగా ఆడాడు. అతడు మంచి సహకారం అందించాడు. దాంతో నాపై ఒత్తిడి తగ్గింది. గ్లెన్ మాక్స్వెల్ ఆడిన తీరు అమోఘం. అయితే మేం సాధించిన 166 పరుగులు మోస్తరు స్కోరే. ఇక ముంబై ఇన్నింగ్స్లో 30 పరుగుల తేడాతో మా బౌలర్లు 8 వికెట్లు పడగొట్టడం నమ్మశక్యం కానిది. ఈ ఆటలో మొత్తం మా ప్రదర్శనకు 10 పాయింట్లు ఇస్తే.. బ్యాటింగ్ పరంగా 8 పాయింట్లు ఇస్తా. ఎందుకంటే.. మేం సుమారు 20-25 పరుగులు ఎక్కువ సాధించాల్సి ఉండే' అని బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం తెలిపాడు.