ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ విజయం సాధించిన తర్వాత భారత మాజీ ఓపెనర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా పేరు ప్రస్తావించకుండానే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు గట్టి హెచ్చరిక చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి తక్కువ సమయం ఉన్నందున టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్లో ప్రయోగాలు ఆపేయాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రయోగాల వల్ల తీవ్ర పరిణామాలు
టీమిండియా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఐదు టీ20ల సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్ సందర్భంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భారత బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అనేక ప్రయోగాలు చేశారు. సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడం, ఆ తర్వాత అతడిని పూర్తిగా పక్కన పెట్టి బెంచ్ స్ట్రెంత్ను ఉపయోగించడం వంటివి జరిగాయి. ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. తర్కంతో కూడిన గట్టి హెచ్చరికను చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో చేసిన ప్రయోగాలు ఇప్పుడు ఆపకపోతే, టీ20 ప్రపంచకప్కు ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

'ప్రయోగాల కాలం ముగిసింది'
భారత జట్టులో ప్రయోగాల దశ నడుస్తోందని ఆకాశ్ చోప్రా అన్నారు. "జట్టులో ఎవరినైనా బ్యాటింగ్ ఆర్డర్లో పైకి లేదా కిందకు పంపవచ్చు. ఎవరికైనా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కవచ్చు లేదా ఎవరినైనా తీసివేయవచ్చు. జట్టు దీనిని బహిరంగంగా అంగీకరించినప్పుడు, సరే మీరు ప్రయోగాలు చేసుకోండి అని అనుకున్నాము. ఆస్ట్రేలియాలో ఐదు టీ20ల సిరీస్ వర్షం కారణంగా మూడు మ్యాచ్లతోనే ముగిసింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్కు ముందు భారత జట్టు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్తో 5-5 టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చూస్తే, ప్రయోగాల సమయం ముగిసింది అని నేను భావిస్తున్నాను. మనం చేయాల్సిన పని పూర్తి చేశాం. ఇప్పుడు మీరు ఎక్కువ ప్రయోగాలు చేయకూడదు, ఎందుకంటే ఫిబ్రవరిలో ప్రపంచకప్ ప్రారంభం కానుంది." అని ఆకాశ్ చోప్రా వెల్లడించారు.
స్వదేశంలో ఒత్తిడి ఎక్కువ
ఆకాశ్ చోప్రా ప్రపంచకప్ స్వదేశంలో జరగడం వల్ల జట్టుపై ఉండే ఒత్తిడిని కూడా గుర్తు చేశారు."స్వదేశంలో పెద్ద టోర్నమెంట్లు ఆడటం వల్ల చాలా ఒత్తిడి ఉంటుంది. మనం డిఫెండింగ్ ఛాంపియన్లం (2024లో టైటిల్ గెలిచిన తర్వాత). అయితే, మేము దేనినీ తేలికగా తీసుకోకూడదు, ఎందుకంటే స్వదేశంలో ప్రపంచకప్ గెలవడం చాలా కష్టం." స్వదేశంలో జరిగే ఈవెంట్ కాబట్టి ప్రయోజనం ఉన్నప్పటికీ, ఒత్తిడి కూడా అంతే ఉంటుంది. అందుకే జట్టు యాజమాన్యం ఇప్పుడు అన్ని రకాల ప్రయోగాలు ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు. "ఇకపై మనం ఏ ప్లేయింగ్ ఎలెవన్తో ఆడతామో, అదే టీమ్ ప్రపంచకప్కు అత్యంత దగ్గరగా ఉంటుంది." అని ఆయన అన్నారు.
టీ20 ప్రపంచకప్ 2026 వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ ఆకాశ్ చోప్రా హెచ్చరికను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి.