
భారత్లో జరుగుతున్న తొలి మహిళల ప్రీమియర్ లీగ్లో ట్రోఫీ ముంబై ఇండియన్స్ జట్టుకే దక్కే అవకాశం ఉందట. ఈ విషయాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా చెప్పాడు. ఈ లీగ్లో టేబుల్ టాపర్గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందుగా ఫైనల్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఎలిమినేటర్లో యూపీ వారియర్జ్ను 72 పరుగుల తేడాతో ఓడించిన ముంబై కూడా ఫైనల్ చేరింది. ఈ రెండు జట్లు తొలి డబ్ల్యూపీఎల్ ట్రోఫీ కోసం తలపడనున్నాయి.
'ఢిల్లీ జట్టు నా మనసుకు దగ్గరగా ఉంది. కానీ ముంబై చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ప్లేయర్ టు ప్లేయర్ పోలిక చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. కాబట్టి ఈ ట్రోఫీ ముంబైదే అని నమ్ముతున్నా' అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ బలాల గురించి కూడా చోప్రా విశ్లేషించాడు. ఈ టోర్నీలో ముంబై ఓపెనర్ యాస్తికా భాటియా నెమ్మదిగా గాడిన పడిన సంగతి గుర్తుచేశాడు. ఈ లీగ్లో భాటియా స్థాయి నెమ్మదిగా పెరిగిందన్నాడు.
అలాగే మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తోందని చెప్పాడు. పిచ్ కనుక స్లగ్గిష్గా లేకపోతే ఆమె చెలరేగుతుందని అభిప్రాయపడ్డాడు. 'బ్రబోర్న్ పిచ్పై పచ్చిక ఉంటుంది. పిచ్ ఇలా ఉంటే హేలీ మాథ్యూస్ చెలరేగుతుంది. ఆమె బ్యాటింగ్ మెరుగ్గా ఉంటుంది. బంతి కనుక బ్యాటు మీదకు వస్తోందంటే ఆమె చాలా డేంజర్ బ్యాటర్' అని వివరించాడు. అలాగే ఢిల్లీతో పోలిస్తే ముంబై జట్టు బ్యాటింగ్ డెప్త్ చాలా బాగుందని తెలియజేశాడు.
చివరి మ్యాచ్లో తను ఏం చేయగలదో నటాలీ సివర్ చూపించిందని, ఆ తర్వాత వరుసగా హర్మన్ప్రీత్ కౌర్, అమీలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇసబెల్లా వాంగ్ ఉన్నారని చోప్రా గుర్తుచేశాడు. ఢిల్లతో పోలిస్తే ఇది చాలా డెప్త్ ఉన్న బ్యాటింగ్ లైనప్ అన్నాడు. అదే సమయంలో పిచ్ కనుక గ్రీన్గా ఉంటే ఢిల్లీ కూడా చెలరేగుతుందని వివరించాడు. 'ఢిల్లీ జట్టుకు ఉన్న బలహీనత స్పిన్ బౌలింగే. అలా చూసుకుంటూ పచ్చగా ఉన్న పిచ్పై ఆ జట్టు కూడా రెచ్చిపోయే అవకాశం ఉంది' అని చోప్రా విశ్లేషించాడు.
ముంబై వద్ద ముగ్గురు మంచి స్పిన్నర్లు ఉన్నారని గుర్తుచేశాడు. సైకా ఇషాక్, అమీలియా కెర్, హేలీ మాథ్యూస్ ముగ్గురూ స్పిన్ పిచ్ను చక్కగా యూజ్ చేసుకోగలిగిన వారే. అదే ఢిల్లీ వద్ద అంత గొప్ప స్పిన్ ఎటాక్ లేదని అభిప్రాయపడ్డాడు. 'రాధా యాదవ్ బౌలింగ్ చూస్తే ఆమె బౌలింగ్ అంత గొప్పగా లేదని తెలిసిపోతోంది. ఇక అలైస్ క్యాప్సీ కేవలం పార్ట్ టైమర్ అని గుర్తుంచుకోవాలి. ఇక మిగిలింది కేవలం జెస్ జోనాసెన్ మాత్రమే' అని చోప్రా వివరించాడు. అందుకే మ్యాచ్ కనుక సీమర్ ఫ్రెండ్లీ పిచ్పై జరిగితే ఢిల్లీ కూడా బలంగా ఉంటుందన్నాడు.