శిఖర్ ధావన్కు ఇక అవకాశం రాకపోవచ్చు: ఆకాశ్ చోప్రా

ఢిల్లీ: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్కు టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం భవిష్యత్తులో కష్టమేనంటూ భారత మాజీ టెస్టు ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఓపెనర్గా టీమిండియా మేనేజ్మెంట్ కూడా ధావన్ స్థానంలో ఇతరులకు కూడా అవకాశం ఇవ్వలేదు. కెఎల్ రాహుల్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ, మురళీ విజయ్ వరకు భారత క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో ఓపెనర్గా అనేక మంది ఆటగాళ్లను ప్రయత్నించింది. కానీ ధావన్ లాగా నిలకడగా ఎవరు రాణించలేదనే చెప్పుకోవాలి.

టెస్టుల్లో అవకాశం రాకపోవచ్చు:
34 ఏళ్ల వయసు ఉన్న శిఖర్ ధావన్ మళ్లీ టెస్టు క్రికెట్ ఆడే అవకాశం ఉందా అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ ద్వారా సమాధానమిచ్చాడు. 'అవకాశం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. అయితే ఆ అవకాశం తొందరగా రావొచ్చు.. రాకపోవచ్చు. కానీ శిఖర్ ధావన్ మళ్లీ టెస్టులు ఆడే అవకాశం ఇప్పట్లో లేనట్లే. ఎందుకంటే జట్టు మేనేజ్మెంట్ ఇప్పటికే టెస్టు ఓపెనర్గా పలువురు ఆటగాళ్లను పరిక్షించింది. ధావన్ విఫలమైన తర్వాత రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా తమను తాము నిరూపించుకున్నారు. గిల్ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. శిఖర్ ధావన్కు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం రాకపోవచ్చు.. ఒకవేళ వచ్చినా అది ఇప్పట్లో జరుగదు' అని ఆకాశ్ అన్నాడు.

వన్డేలు, టీ20లపై దృష్టి పెట్టాలి:
'శిఖర్ ధావన్ స్వతహాగా అద్భుతమైన వైట్బాల్ ఆటగాడు. అతడి టెస్టు కెరీర్ కూడా బాగానే ఉంది. కానీ అతను వన్డేలు, టీ20లపై దృష్టి పెట్టాలి. టెస్టుల్లో ఇప్పటికే రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా రాణిస్తున్నారు. పృథ్వీ షా, కేఎల్ రాహుల్ కూడా వీరికి ప్రత్యామ్నాయంగా బాగానే ఆడుతున్నారు. యువ యువ ఆటగాడు గిల్ కూడా భవిష్యత్తులో ఆడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్లో ధావన్కు టెస్టుల్లో అవకాశం లభించకపోవచ్చు' అని ఆకాశ్ చెప్పుకొచ్చాడు.

2018లో చివరి మ్యాచ్:
2013లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా భారత్ తరఫున శిఖర్ ధావన్ అరంగేట్రం చేశాడు. ఆరంభ మ్యాచ్లోనే భారీ సెంచరీ (177) సాధించి ఔరా అనిపించాడు. టెస్టు ఓపెనర్గా మొత్తం 34 టెస్టుల్లో 40.61 సగటుతో 2,315 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు ఉన్నాయి. అయితే 2018 తర్వాత టెస్టుల్లో ధావన్ ప్రదర్శన అంతకంతకు దిగజారడంతో.. ఏకంగా జట్టులోనే చోటు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరిగి జట్టులోకి ఎంపిక కాలేదు. 2018 ఇంగ్లండ్ పర్యటనలో ఓవల్లో జరిగిన టెస్టు మ్యాచ్లో ధావన్ చివరిసారిగా ఆడాడు.

మూడు ఫార్మాట్లలో 24 శతకాలు:
సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్తో ప్రముఖ మేనేజ్మెంట్ కంపెనీ ఐఎంజీ రిలయన్స్ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై ధావన్ మార్కెటింగ్ వ్యవహారాలన్నీ ఐఎంజీ పర్యవేక్షించనుంది. ఈ ఒప్పందంలో భాగంగా స్పాన్సర్షిప్, ఎండార్స్మెంట్, ప్రమోషనల్ కార్యక్రమాలు, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు అన్నింటిని ఐఎంజీ రిలయన్స్ కంపెనీ చక్కబెడుతుంది. అంతర్జాతీయ కెరీర్లో గబ్బర్ ఇప్పటివరకు 34 టెస్టుల్లో, 136 వన్డేల్లో, 61 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 24 శతకాలు బాదాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications