
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కామెంటేటర్గా తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. క్రికెటర్ నుంచి కామెంటేటర్గా మారిన ఆకాశ్ చోప్రా తన హిందీ వ్యాఖ్యానంతో పాటు క్రికెట్ విశ్లేషణకు అప్పుడప్పుడు ప్రశంసలు కూడా అందుకుంటాడు. అయితే, భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా తొమ్మిదేళ్ల క్రితం చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
2010 అక్టోబర్లో టీమిండియా పేసర్ దీపక్ చాహర్ను ఉద్దేశించి ఆకాశ్ చోప్రా ఓ ట్వీట్ చేశాడు. సౌరభ్ మల్హోత్రా అనే నెటిజన్ అడిగిన ప్రశ్నకు గాను ఆకాశ్ చోప్రా తన ట్విట్టర్లో "ప్రతిభ ఉన్న యువ ఆటగాడిని చూశాను. అతడు రాజస్థాన్కు చెందిన దీపక్ చాహర్. అతడి పేరు గుర్తు పెట్టుకోండి. మీరు భవిష్యత్లో దీపక్ గొప్ప ప్రదర్శన గురించి చర్చించుకుంటారు" అని ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం ఆకాశ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "అవును, 9 సంవత్సరాల తర్వాత, మేము అతడిలో ఫైర్ని చూస్తున్నాము. ఆ ఫైర్ ప్రపంచంలోని ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్మెన్ను కాల్చగలదు. ధన్యవాదాలు... మీ భవిష్యత్ అంచనాకు. అతడికి గొప్ప భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
నాగ్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మూడో టీ20లో దీపక్ చాహర్ అద్భుత ప్రదర్శన చేశాడు. హ్యాట్రిక్తో పాటు అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలను (3.2-0-7-6) నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో ఆరు వికెట్లు తీయడంతోపాటు టీ20ల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.
ఫలితంగా మూడు టీ20ల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత మూడు రోజుల వ్యవధిలోనే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో విదర్భతో జరిగిన మ్యాచ్లో దీపక్ చాహర్ మరో హ్యాట్రిక్ సాధించాడు.