ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో పరాజయం. గురువారం రాత్రి వాంఖెడేలో చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైందీ టీమ్. సమష్టిగా విఫలమైంది. తొలుత బౌలింగ్ లో, ఆ తర్వాత బ్యాటింగ్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. ఏ ఒక్క బ్యాటర్ కూడా రాణించలేదు. గెలవడానికి 208 పరుగులు చేయాల్సి ఉన్నప్పటికీ.. టాప్ టు బాటమ్ వరకూ బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మాత్రమే కాస్తో, కూస్తో పరుగులు చేశారు.
ముంబై ఇండియన్స్ వైఫల్యంపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా తీవ్ర విమర్శలు గుప్పించాడు. సూర్యకుమార్ యాదవ్ ఆటతీరుపై నిలదీశాడు. టీమిండియా టీ20 కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్.. ఈ ఐపీఎల్ లో ఏడు ఇన్నింగ్స్లలో నాలుగు సిక్సర్లు మాత్రమే కొట్టాడు. దీనిపై ఆకాష్ చోప్రా విస్మయం వ్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై సూర్యకుమార్ 30 బంతుల్లో 35 పరుగులు చేసినప్పటికీ ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు.

సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అస్సలు పరుగులు చేయకపోవడం తనను ఆశ్చర్యానికి, అసహనానికీ గురి చేస్తోందని ఆకాశ్ చోప్రా చెప్పాడు. స్పిన్నర్లను ఎదుర్కొనడంలో విఫలమౌతోన్నాడని, స్వీప్ చేయబోయి మూడుసార్లు ఔటయ్యాడని గుర్తు చేశాడు. హార్దిక్ పాండ్యా కూడా ఈ సీజన్లో బ్యాట్, బాల్ రెండింటితోనూ నిరాశపరిచాడని గుర్తు చేశాడు. ఆరు మ్యాచ్ల్లో హార్దిక్ 97 పరుగులే చేశాడని, తీసింది మూడు వికెట్లేనని ఇది ఎంతమాత్రం కూడా అతని స్థాయికి తగ్గ ఆటతీరు కాదని విమర్శించాడు.
వారే విఫలమైనప్పుడు తిలక్ వర్మ, క్వింటన్ డికాక్ లేదా నమన్ ధీర్ పరుగులు చేస్తారని ఆశించలేమని, ముగ్గురు ఆటగాళ్లతో జట్టు నడవదని తేల్చి చెప్పాడు. హార్దిక్ పాండ్యా వ్యూహాత్మక నిర్ణయాలపై ఆకాష్ చోప్రా ప్రశ్నలు సంధించాడు. సీఎస్కే మ్యాచ్లో చివరి ఓవర్ను హార్దిక్ ఎందుకు వేయలేదని ప్రశ్నించాడు. రెండు ఓవర్లల్లో 19 చొప్పున మొత్తం 38 పరుగులు సమర్పించుకున్న హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ వేసే సాహసం చేయలేకపోయాడని, క్రిష్ భగత్ కూడా ఒకే ఓవర్లో 15 రన్స్ ఇచ్చాడని స్పష్టం చేశాడు.