ముంబై: యూఏఈలో ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2020లో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్ను ప్రత్యర్థులు అర్థం చేసుకోలేకపోయారని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. సన్రైజర్స్ జట్టులో 'మ్యాన్ ఆఫ్ ది టోర్నీ'గా ఎంపిక చేయాలంటే డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్ ముందు వరుసలో ఉంటారన్నాడు. అయితే తాను మాత్రం అఫ్గాన్ స్పిన్నర్నే ఎంచుకుంటానని చెప్పాడు. వార్నర్, ఖాన్లను తప్పకుండా రిటైన్ చేసుకోవాలని అభిప్రాయపడ్డాడు. వరుస విజయాలు సాధించిన వార్నర్ సేన ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బెంగళూరును ఓడించినా.. ఆ తర్వాత ఢిల్లీ చేతిలో ఓటమిపాలై మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ... 'ఐపీఎల్ 2020లో డేవిడ్ వార్నర్ చివర్లో రెచ్చిపోయాడు. అయితే రషీద్ ఖాన్ మాత్రం టోర్నీ ఆరంభం నుంచి చివరి వరకు నిలకడగా రాణించాడు. ఢిల్లీపై రెండు సార్లు 3/7, 3/14 అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. చెన్నై పైనా అద్భుతంగా రాణించాడు. అలాగే పలు మ్యాచ్ల్లో 20 కన్నా తక్కువ పరుగులే ఇచ్చాడు. సన్రైజర్స్ గెలుపొందిన చాలా మ్యాచ్ల్లో అతడి ఎకానమీ 3 నుంచి 3.5 మాత్రమే ఉంది. ఇదెంతో అద్భుతమైన బౌలింగ్' అని కొనియాడాడు. కేవలం ఐపీఎల్ టోర్నీలో మాత్రమే కాదు.. అంతర్జాతీయ క్రికెట్లో కూడా రషీద్ ఖాన్ను ఎదుర్కొనేందుకు టాప్ బ్యాట్స్మన్ సైతం తడబడుతున్నారు.
'రషీద్ ఖాన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్లో తక్కువ మ్యాచ్లు ఆడి యూఏఈ వచ్చాడు. దుబాయ్, అబుదాబి, షార్జా లాంటి పిచ్లపై అతడి బౌలింగ్ను ముందే అర్థం చేసుకోవాలి. లేదంటే ఆ తర్వాత అవకాశం ఉండదు. ప్రత్యర్థులు అలా ప్రయత్నించినా.. ఎవరివల్లా కాలేదు. ప్రతి ఒక్కరూ అతడి బౌలింగ్ను అర్థం చేసుకునే విషయంలో విఫలమయ్యారు. రషీద్ బంతి ఎందుకుంటేనే చాలా వికెట్ కాపాడుకోవడానికే మొగ్గుచూపారు. అందుకే సన్రైజర్స్ తరఫున రషీద్ ఖాన్ మ్యాన్ ఆఫ్ టోర్నమెంట్గా నిలుస్తాడు' అని చోప్రా చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2021లో మరో కొత్త జట్టు రానుందని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే బీసీసీఐ మెగా వేలం నిర్వహించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్లను తప్పకుండా రిటైన్ చేసుకోవాలని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అలాగే భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్లను రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారా తీసుకోవాలన్నాడు. ఇక ప్రధాన పేసర్ అయిన భువనేశ్వర్కు బ్యాకప్ బౌలర్ను పొందలేరన్నాడు. మనీష్ పాండే, కేన్ విలియమ్సన్లను కూడా రిటైన్ చేసుకోవడానికి ప్రయత్నించాలన్నాడు. అయితే విలియమ్సన్, బెయిర్ స్టో, జాసన్ హోల్డర్ల మధ్య కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని అతడు పేర్కొన్నాడు.
అమూల్ యాడ్ సహాయంతో.. ఆమెకు ప్రపోజ్ చేసిన కపిల్ దేవ్!!