టెస్ట్లు, వన్డేలు, టీ20లు.. ఫార్మాట్ ఏదైనా ధనాధన్ బాదుడే అన్నట్టుగా ఉంటే ఇంగ్లాండ్ ప్లేయర్లు.. నిలకడగా రాణించలేక తేలిపోతున్నారు. ఈ బజ్బాల్ వీరులు ఓ సారి మెరుపులు మెరిపిస్తే.. మరోసారి తోక ముడిచేస్తున్నారు. తాజాగా జరిగిన తొలి వన్డేలోనూ ఇదే ప్రదర్శన చేశారు. మ్యాచ్ ఆరంభంలో ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ మంచి ఇన్నింగ్సే ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత జోరును కొనసాగించలేక ఓటమిని అందుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ ఆటతీరుపై మరోసారి విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజా మ్యాచ్ లో వారి ఆటతీరుపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. అలానే వారి జెర్సీలపై ముద్రించి ఉన్న మూడు సింహాల బొమ్మలను కూడా ఉద్దేశించి సెటైర్లు వేశాడు. ఇంగ్లాండ్ క్రికెటర్లు జెర్సీలపై సింహాలను ముద్రించుకుని.. మైదానంలో పిల్లిలా మియావ్ మియావ్ అంటున్నారని అన్నాడు.

గత మూడు పర్యటనలలో అన్నీ ఫార్మట్లలో భారత్ పై ఇంగ్లాండ్ బ్యాటింగ్ బాగా ఇబ్బందిని ఎదుర్కొందని ఆకాశ్ చోప్రా అన్నాడు. "వాళ్ల పరిస్థితి ఎలా ఉందో నేను ఇప్పుడు చెబితే మీరు ఆశ్చర్యపోతారు. గత మూడు పర్యటనలలో టెస్ట్, వన్డే, టీ20 అన్నీ ఫార్మాట్లలో కలిపి 25 ఇన్నింగ్స్ లో 19 సార్లు బోల్తా పడ్డారు. వాళ్లు ఎటువంటి టర్నింగ్ పిచ్ లపై సరిగ్గా ఆడట్లేదు. " అని చెప్పుకొచ్చాడు.