టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన సంచలన వ్యాఖ్యలను మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా సమర్థించాడు. గవాస్కర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని అభిప్రాయపడ్డాడు. రోహిత్ను తప్పించి వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు సారథి బాధ్యతలు కట్టబెట్టడం సరైనేదే అని అన్నాడు. అసలు సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే..
నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న అయిదు టెస్టు సిరీస్లో పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్టుకు రోహిత్ ఆడటం అనుమానమే అని వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్కు గురైన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ కూడా దీని గురించి స్పందించాడు. పెర్త్ టెస్టుకు గైర్హాజరీపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, దాని గురించి ఆలోచిస్తున్నట్లు రోహిత్ తెలిపాడు. వ్యక్తిగత కారణాలతో రోహిత్ తొలి టెస్టుకు దూరమవ్వాలని భావిస్తున్నాడు.

తన భార్య రితికా సజ్దేహ్ రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో కుటుంబంతో ఉండాలని హిట్మ్యాన్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు గైర్హాజరైతే, మిగిలిన నాలుగు టెస్టులకు రోహిత్ కేవలం ఆటగాడిగా జట్టులో కొనసాగాలని గవాస్కర్ అన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ మొత్తానికి బుమ్రానే సారథిగా నియమించాలని తెలిపాడు.
కాగా, గవాస్కర్ వ్యాఖ్యలపై తాజాగా ఆకాశ్ చోప్రా స్పందించాడు. గవాస్కర్ చెప్పింది సరైనదే అని అన్నాడు. ''వ్యక్తిగత కారణాలతో రోహిత్ ఆస్ట్రేలియాకు ఎప్పుడు వస్తాడో తెలియదు. గవాస్కర్ చెప్పింది కరెక్టే. సిరీస్ ఆరంభానికి కెప్టెన్ అందుబాటులో లేకపోతే, సిరీస్ మొత్తానికి అతన్ని కెప్టెన్గా చేయొద్దు. వైస్ కెప్టెన్ను కెప్టెన్గా నియమించాలి. ఆ తర్వాత రోహిత్ ఆటగాడిగా కొనసాగాలి. పెద్దసిరీస్ ఆరంభానికి కెప్టెన్ గైర్హాజరీ సరైనది కాదు. కాబట్టి సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి లేదు'' అని ఆకాశ్ చోప్రా అన్నాడు.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్
డిసెంబర్ 06-10: రెండో టెస్టు- అడిలైడ్
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ .