భారత వెటరన్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. గబ్బా టెస్ట్ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. అంతకు ముందు విరాట్ కోహ్లీతో కలిసి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో అశ్విన్ కోహ్లీతో ఎమోషనల్ గా మాట్లాడుతున్నట్లు కనిపించింది. టీ విరామం సమయంలో వారు డ్రెస్సింగ్ రూమ్లో చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో అశ్విన్ ఉద్వేగానికి లోనైనట్లు కనిపించింది. ఈ సందర్భంలోనే కోహ్లీ తన సహచరుడిని కౌగిలించుకున్నాడు.
మూడో టెస్ట్ కు రవీంద్ర జడేజాను ఏకైక స్పిన్నర్గా ఎంపిక చేయడంతో అశ్విన్ను కెప్టెన్ రోహిత్ శర్మ మూడో టెస్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల అశ్విన్ ఈ టూర్లో కేవలం ఒక టెస్టు మాత్రమే ఆడాడు. అడిలైడ్ ఓవల్లో జరిగిన పింక్-బాల్ టెస్ట్లో ఆడాడు. ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో 22 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో 7 పరుగులు చేశాడు. వర్షం విరామ సమయంలో కోహ్లి సమక్షంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో అశ్విన్ మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసిన తర్వాత, అశ్విన్ తన మ్యాచ్ తర్వాత రోహిత్తో కలిసి విలేకరుల సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఉద్వేగానికి లోనైన అశ్విన్ ప్రకటన చేసిన తర్వాత విలేకరుల సమావేశం నుంచి వెళ్లిపోయాడు. జర్నలిస్టుల ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించినా అశ్విన్ వెళ్లిపోయాడు.
రవిచంద్రన్ అశ్విన్ తన మొదటి వన్డే మ్యాచ్ శ్రీలంకతో 2010 జూన్ 5 ఆడాడు. 116 వన్డే మ్యాచ్ లో 156 వికెట్లు తీయడంతో పాటు 707 పరుగులు చేశాడు.ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. మొదటి టెస్ట్ మ్యాచ్ 2011, నవంబర్ 6న వెస్టీండిస్ పై ఆడాడు. 105 టెస్టుల్లో 536 వికెట్లు పడగొట్టాడు. 3,474 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 65 టీ20 మ్యాచ్ ల్లో 72 వికెట్లు తీయడంతో పాటు 184 పరుగులు చేశాడు.