IPL Auction 2025 Nita Ambani: ఎప్పుడెప్పుడా అంటూ క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 17వ ఎడిషన్కు రంగం సిద్ధమైంది. ఈ టోర్నమెంట్లో ఆడబోయే క్రికెటర్ల కోసం మెగా వేలంపాట జరుగుతోంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆరంభం కానుంది.
మొత్తం రెండు రోజుల పాటు సాగే మెగా ఆక్షన్ ఇది. ఐపీఎల్ ఆడే మొత్తం ఫ్రాంఛైజీలు వేలంపాటలో పాల్గొన్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీల అధినేతలు ఈ వేలానికి హాజరయ్యారు.

577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి. తొలి రోజున 84 మంది ప్లేయర్లు రేసులో నిలిచారు. వారికోసం వేలం సాగుతోంది. రిటైనింగ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యంలో- ఒక్కో జట్టులో కొత్త ముఖాలు పెద్ద సంఖ్యలో వచ్చి చేరనున్నాయి.
టీమిండియా టీ20 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్తో వేలం ఆరంభమైంది. పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. అతన్ని 18 కోట్ల రూపాయలతో సొంతం చేసుకుంది పీబీకేఎస్. మొదటి నుంచీ ఈ పంజాబీ ఎక్స్ప్రెస్ బౌలర్.. ఈ ఫ్రాంఛైజీలోనే కొనసాగుతూ వస్తోన్నాడు. మరోసారి అతను టీమ్లో రీఎంట్రీ ఇచ్చాడు.
ఈ వేలం పాట సమయంలో ముంబై ఇండియన్స్ చీఫ్ నీతా అంబానీ ప్రదర్శించిన హావభావాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంకాస్సేపట్లో వేలం ప్రారంభమౌతుందనగా.. బిడ్డింగ్ పేపర్స్ చేతిలో పట్టుకుని, దాన్ని చేతులతో తడిమి కళ్లకు అద్దుకోవడం కనిపించింది.