మతం కోసం తనకు ఇష్టమైన క్రికెట్కు వీడ్కోలు పలికిందో అమ్మాయి. ఈ ఘటన పాకిస్తాన్ క్రికెట్లో చోటు చేసుకుంది. పాక్ మహిళల జట్టులో చోటు సంపాదించి, ఫ్యూచర్ స్టార్గా పేరొందిన ఆయేషా నసీం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కేవలం 18 ఏళ్ల వయసులోనే క్రికెట్ కెరీర్కు గుడ్బై చెప్తున్నట్లు ప్రకటించింది. తను ఇస్లాం నిబంధనలకు అనుగుణంగా జీవించాలని అనుకుంటున్నట్లు తెలిపింది.
ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కూడా ఆమె తెలియజేసినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో పాక్లో మహిళా క్రికెట్కు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో ఆమె కచ్చితంగా భవిష్యత్తులో స్టార్గా ఎదిగే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ తను మాత్రం క్రికెట్ను వదిలి ఇస్లాంకు అనుగుణంగా జీవించాలని అనుకుంటున్నట్లు ఆయేషా షాకింగ్ నిర్ణయం వెల్లడించింది.

అసలు జాతీయ జట్టులో చోటు సంపాదించడమే కష్టమైన పరిస్థితుల్లో.. తన ట్యాలెంట్తో పాకిస్తాన్ మహిళ జట్టుకు ఆయేషా ఎంపికైంది. 2020లో ఈ టీం తరఫున అరంగేట్రం చేసిన ఆమె ఇప్పటి వరకు 30 టీ20లు, నాలుగు వన్డేల్లో పాక్కు ప్రాతినిధ్యం వహించింది. టీ20ల్లో 369 పరుగులు చేసిన ఆమె.. వన్డేల్లో కేవలం 33 పరుగులు మాత్రమే చేసింది. వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోకున్నా.. టీ20ల్లో ఆమె సత్తా అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఇటీవల మహిళల టీ20 వరల్డ్ కప్లో ఆయేషా అద్భుతమైన ప్రదర్శనలతో అందరి మన్ననలు పొందింది. ముఖ్యంగా భారత్పై మ్యాచ్లో కేవలం 25 బంతుల్లోనే 43 పరుగులతో అజేయంగా నిలిచింది. అయితే చివరి నిమిషంలో ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించడంతో ఆయేషా ఇన్నింగ్స్ వృధా అయింది.
పాకిస్తాన్ లెజెండ్ వసీం అక్రమ్ కూడా ఆయేషా సత్తాను గుర్తించి.. ఆమెను సానబెడితే అద్భుతమైన మ్యాచ్ విన్నర్గా మారుతుందని కొనియాడాడు. అంత ట్యాలెంట్ ఉన్న ఆయేషా ఇలా షాకింగ్ నిర్ణయం తీసుకోవడం పాక్ క్రికెట్కు పెద్ద ఎదురు దెబ్బ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇప్పుడు ఆమెను రిప్లేస్ చేసే ప్లేయర్ కోసం పీసీబీ వెతుకుతోంది.