న్యూఢిల్లీ: క్రికెట్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతోన్న క్రీడారంగం. అంతేగాక, ఆర్థిక వనరులు కూడా ఈ క్రీడాకు భారీ మొత్తంలో లభిస్తున్నాయి. అందుకే చాలా మంది పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు క్రికెట్ వైపు అడుగులు వేశారు. మరికొంత మంది ఈ రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు కూడా. అయితే, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే చాలా మంది ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీరంగం వారికి క్రికెట్ కలిసిరానట్టే తెలుస్తోంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) అధ్యక్షుడిగా పని చేసిన పారిశ్రామికవేత్త ఎన్ శ్రీనివాసన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని తన పదవిని కోల్పోవాల్సి ఏర్పడింది. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టి కర్తగా పేరుతెచ్చుకున్న లలిత్ మోడీపై కూడా అవినీతి ఆరోపణలు రావడంతో అతను మన దేశంలో అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది.
తాజాగా కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా కూడా బ్యాంకుల నుంచి ఎగవేతదారు ముద్ర వేసుకున్నారు. ఈయన ఐపీఎల్ టోర్నీలో బెంళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఫ్రాంఛైజీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా బాలీవుడ్ నటి ప్రీతి జింతా, మరో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా, పారిశ్రామివేత్త సుబ్రతా రాయ్, వెంకటరామిరెడ్డి, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ తదితరులు క్రికెట్ రంగంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు.
ప్రొఫెషనల్ క్రికెట్లోని మజాను ప్రేక్షకులకు అందించడంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో భాగంగా 2007లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను ప్రారంభించింది. భారత క్రికెట్ కంట్రలోల్ బోర్డు (బీసీసీఐ). ఇంగ్లాడ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ పోటీల నమూనాలో తయారైన ఐపీఎల్ ద్వారా ఎంతోమంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు.

అయితే అవినీతి ఆరోపణలు, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఈ లీగ్కు మచ్చతెచ్చాయి. లీగ్ కోసం జట్లను కొనుగోలుచేసేందుకు సినీ, వ్యాపార, రాజకీయ రంగాల ప్రముఖులు విపరీతమైన ఆసక్తికనబర్చడం ఆ క్రమంలో భారీగా నల్లధనం తెల్లగా(సక్రమంగా) మారిపోవడం, నిజానికి ఆపని కోసమే ఐపీఎల్ ఉద్భవించిందని మాట్లాడుకోవటం అప్పట్లో హాట్ టాపిక్ మారింది.
ఐపీఎల్ వచ్చాక ఈ రంగంలో ప్రవేశించిన ప్రముఖుల కెరీర్ గ్రాఫ్ ఎలా పడిపోయిందో చూస్తే అర్థమవుతుంది వారి పరిస్థితి. ఇందులో మొదటగా బిసిసిఐ మాజీ ఛైర్మన్ శ్రీనివాసన్, ఐపిఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ, చివరగా కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది.
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై నిషేధం విధించిన దరిమిలా వాటి యజమానులైన శ్రీనివాసన్, ఆయన అల్లుడు మేయప్పన్, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాలపై కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సతీమణి, దివంగత సునందా పుష్కర్.. కొచ్చి టస్కర్స్ జట్టును కొనుగోలుచేసినప్పుడు భారీ ఎత్తున నల్లధనం వినియోగంలోకి తెచ్చారనే ఆరోపణలునున్నాయి.
క్రికెట్ సంబంధిత ఆర్థిక వ్యవహారాలే ఆమె మరణానికి కారణమైనట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింతాది మరోరకం వివాదం. ఏళ్లుగా డేటింగ్ చేసి ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతారనగా, అదే జట్టుకు మరో సహయజమాని నెస్ వాడియాతో ఆమె గొడవపడి విడిపోయారు. ఈ మధ్యే మరొక వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు.
ఐపిఎల్ టోర్నీలో భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో లలిత్ మోడీ దేశం విడిచి ఇంగ్లాండ్లోని లండన్లో నివాసముంటున్నాడు. ఇది ఇలా ఉండగా, అప్పటి ఐపీఎల్ జట్టు డెక్కన్ ఛార్జర్స్ యజమాని, 'డెక్కన్ క్రానికల్' ఆంగ్ల దినపత్రిక చైర్మన్ టి వెంకట్రామిరెడ్డి తప్పుడు పత్రాలతో బ్యాంకుకు వందల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టారనే ఆరోపణలపై అరెస్టయ్యారు.
కాగా, పుణె వారియర్స్ జట్టు యజమాని, సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్.. తన సంస్థలో చేరిన ముదుపుదారుల్ని దారుణంగా మోసంచేసి, మూడేళ్లుగా జైలులోనే ఉన్నారు.
తాజాగా, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు యజమాని విజయ్ మాల్యా వివిధ బ్యాంకుల్లో రూ. 9000 కోట్ల రుణం తీసుకుని ఎగవేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు బ్యాంకులపై ఒత్తిడి పెంచడంతో ఆయన దేశం విడిచి వెళ్లారనే వార్తలు వినవస్తున్నాయి. దీన్ని బట్టిచూస్తే కొందరికి క్రికెట్ కలిసి రాకపోతే.. మరికొందరు క్రికెట్కు కలిసి రాలేదని స్పష్టమవుతోంది.