వన్డే వరల్డ్ కప్ను తృటిలో చేజార్చుకున్న భారత్ టీ20 ప్రపంచకప్ను సాధించాలని కసిగా ప్రణాళికలు రచిస్తోంది. వరల్డ్ కప్కు మరో అయిదు నెలల సమయం ఉన్నా జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యాయి. దానికి ప్రధాన కారణం 14 నెలల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చేరడం. ఈ అంశంపై టీమిండియా మాజీలే కాకుండా ఇతర దేశ మాజీ క్రికెటర్లు కూడా విశ్లేషిస్తున్నారు.
సీనియర్లు రోహిత్, కోహ్లి జట్టులోకి వస్తే టీమిండియా మరింత పటిష్టంగా ఉంటుందని దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డారు. మరోవైపు మాజీ క్రికెటర్ దాస్ గుప్తా సీనియర్లు తిరిగి జట్టులోకి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే సెలక్టర్లు సరైనా నిర్ణయమే తీసుకున్నారని సురేశ్ రైనా పేర్కొన్నాడు. ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలో సీనియర్లు ఉండటమే జట్టుకు మంచిదని తెలిపాడు.

అంతేగాక వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇచ్చే వెస్టిండీస్,అమెరికాలో క్లిష్టమైన పిచ్లు ఉంటాయని, అక్కడ కోహ్లి, రోహిత్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని రైనా అన్నాడు. ''ప్రపంచకప్ నిర్వహించే వేదికల్లో కాస్త క్లిష్టమైన పిచ్లు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో భారత్కు రోహిత్, కోహ్లి అనుభవం అవసరం. టీ20 క్రికెట్లో కోహ్లి దాదాపు 12వేల పరుగులు చేశాడు. కాబట్టి జట్టులో వారు ఉంటే టీమిండియా బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారుతుంది. అంతేగాక టీ20 ప్రపంచకప్ను గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి''
''ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లో వారిద్దరు గొప్పగా రాణించారు. డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ మంచి వాతావరణాన్ని నెలకొల్పాడు. అయితే కోహ్లి మూడో స్థానంలో బరిలోకి దిగాలి. అమెరికా, కరేబియన్ వికెట్లపై అతడు జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడు. జట్టులో నిర్భయంగా ఆడే జైశ్వాల్, రింకూ సింగ్, శుభ్మన్ గిల్ వంటి యువ ప్లేయర్లు ఉన్నప్పటికీ రోహిత్, కోహ్లితోనే జట్టు మరింత పటిష్టంగా మారుతుంది. అంతేగాక ప్రపంచకప్లో ఛేజింగ్ తీవ్ర ఒత్తిడితో ఉంటుంది. అలాంటి సందర్భాల్లో జట్టులో వారు తప్పక ఉండాలి'' అని రైనా వివరించాడు.
నయా ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ను రైనా కొనియాడాడు. ''రింకూ సింగ్ తనకు వచ్చిన అవకాశాలు గొప్పగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఫినిషర్గా సత్తాచాటుతున్నాడు. అయితే టీ20 ప్రపంచకప్ సమయానికి రిషభ్ పంత్ కూడా జట్టులో ఉండాలి. అతడు మ్యాచ్ గమనాన్ని మార్చగలడు. అతడో గేమ్ ఛేంజర్'' అని రైనా అన్నాడు. కాగా, జూన్లో జరగనున్న ప్రపంచకప్కు వెస్టిండీస్,అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.