హైదరాబాద్: టీమిండియాలో ఆడాలన్నది ఎప్పట్నుంచో తన కల అని, ఆ కల ఇప్పుడు నెరవేరిందని భువనేశ్వర్ స్థానంలో టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న విజయ్ శంకర్ అన్నాడు. నవంబర్ 23న భువనేశ్వర్ పెళ్లి కారణంగా శ్రీలంకతో జరగనున్న చివరి రెండు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అతని స్థానంలో శ్రీలంకతో టెస్టు సిరీస్ కోసం తమిళనాడు ప్లేయర్ విజయ్ శంకర్కు జట్టులో చోటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడుతూ భారత్ తరఫున ఆడేందుకు ఇంత త్వరగా పిలుపు వస్తుందని తాను తాను ఊహించలేదని అన్నాడు.
'జట్టులోకి రావాల్సిందిగా పిలుపు రావడం చాలా సంతోషంగా ఉంది. టీమిండియాలో ఆడాలన్నది ఎప్పట్నుంచో నా కల. ఇప్పుడు ఆ కల నెరవేరింది. నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. కానీ, ఇంత త్వరగా పిలుపు వస్తుందని నేను వూహించలేదు. త్వరలో నేను భారత డ్రస్సింగ్ రూమ్లో సభ్యుడిని కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని విజయ్ శంకర్ అన్నాడు.
'భారత్-ఎ జట్టులో సభ్యుడిని కావడంతోనే నేను ఆల్రౌండర్గా ఎదిగాను. జట్టు కోసం విభిన్న పరిస్థితుల్లో ఆడిన అనుభవం ఉంది. నా బ్యాటింగ్ ఫామ్పై సంతోషంగా ఉన్నా. ప్రస్తుతం జరుగుతోన్న రంజీ ట్రోఫీలో ఒడిశాపై శతకం సాధించాను. అలాగే ముంబయితో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు తీశాను' అని పేర్కొన్నాడు.
'బ్యాట్తోనూ, బంతితోనూ రాణించడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మాజీ క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీ ఇచ్చిన సలహాలతోనే నేను బౌలింగ్లో రాణించగలుగుతున్నాను. జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిజియో, ట్రైనీ ఇచ్చిన శిక్షణతో పూర్తి ఫిట్గా ఉన్నాను' అని తెలిపాడు.
గత సీజన్లో దేవధార్ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడు కెప్టెన్గా వ్యవహరించిన విజయ్ శంకర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విజయ్ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. భారత జట్టులో విజయ్ చోటు దక్కించుకోవడంతో అతడి కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.