భారత్లో దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్కు ఎంతో ఆదరణ ఉంది. ఐపీఎల్తో మన క్రికెట్ ప్రేక్షకులకు డివిలియర్స్ ఎంతో దగ్గరయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం అతను పోరాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఆర్సీబీ విజయాల కోసం విరాట్ కోహ్లితో కలిసి మిస్టర్ 360 ఎన్నో అద్భుత పోరాటాలు చేశాడు. కళ్లుచెదిరే క్యాచ్లు, స్టేడియం అవతల పడేలా భారీ సిక్సర్లతో అలరించాడు.
అయితే 2021 సీజన్ ముగిసిన అనంతరం ఆర్సీబీకి డివిలియర్స్కు అనూహ్యంగా గుడ్బై చెప్పాడు.జట్టుకు దూరమైనప్పటికీ ఆర్సీబీపై ప్రేమను కొనసాగిస్తున్నాడు. బెంగళూరు టీమ్ మేనేజ్మెంట్ పిలిస్తే జట్టుతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇప్పటికీ పలుసార్లు చెప్పాడు. అయితే స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ను ఆర్సీబీ విడిచిపెట్టినప్పుడు గుండె బద్దలైనట్లుగా అనిపించిందని డివిలియర్స్ పేర్కొన్నాడు. చాహల్ను వదులుకోవడం బెంగళూరు చేసిన ప్రధాన తప్పు అని మిస్టర్ 360 పరోక్షంగా వెల్లడించాడు.

ఇటీవల ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చాహల్ 200 వికెట్ల మార్క్ను అందుకున్న నేపథ్యంలో డివిలియర్స్ మాట్లాడాడు. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్ చాహల్ చరిత్ర సృష్టించాడు. గత సీజన్లలో కోహ్లి, డివిలియర్స్, చాహల్ కలిసి ఆర్సీబీకి చిరస్మరణీయ విజయాలు అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ వికెట్ టేకర్ను ఆర్సీబీ వదిలిపెట్టడంతో రాజస్థాన్ రాయల్స్ 2022 వేలంలో రూ.6.50 కోట్లకు సొంతం చేసుకుంది.
''ఐపీఎల్లో చాహల్ బంతితో డబుల్ సెంచరీ చేశాడు. లీగ్లో 200 వికెట్లను సాధించిన తొలి ప్లేయర్గా నిలిచాడు. అంతేగాక 152 ఇన్నింగ్స్ల్లోనే అతను ఈ ఘనత అందుకోవడం ఆసక్తికర విషయం. ఆర్సీబీ చాహల్ను విడిచిపెట్టినప్పుడు గుండె బద్దలైనట్లుగా అనిపించింది. ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పాను. ఆర్సీబీలో చాహల్ కీలక భాగస్వామి, ఉత్తమ బౌలర్ కూడా. ఆర్సీబీని వదిలి చాహల్ వెళ్లడం క్రేజీగా అనిపించింది''
''200 వికెట్లు సాధించడం అంత ఈజీ కాదు. ఐపీఎల్ ఆల్ టైమ్ సక్సెఫుల్ బౌలర్ చాహల్. కానీ అతను ఆర్సీబీలో లేడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బలంగా మారాడు. రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్నాడు. వాళ్ల విజయాల్లో కీలక పాతర పోషిస్తున్నాడు'' అని డివిలియర్స్ పేర్కొన్నాడు.