
లండన్: భారత క్రికెట్ జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నాడు. సంపూర్ణ ఆరోగ్యంతో ఐసొలేషన్ నుంచి బయటికొచ్చాడు. బర్మింగ్హామ్ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కావడానికి కొద్దిరోజుల ముందే ఆయనకు కోవిడ్ సోకింది. లీసెస్టర్షైర్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆయన కరోనా వైరస్ పాజిటివ్గా తేలాడు. ఫలితంగా- రెండో ఇన్నింగ్లో బ్యాటింగ్కు కూడా దిగలేదు హిట్ మ్యాన్. తాను బస చేసిన హోటల్లోనే ఐసొలేషన్లోకి వెళ్లాడు.
ఇప్పుడతను మహమ్మారి బారి నుంచి కోలుకున్నాడు. పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు. లీసెస్టర్ నుంచి బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్కు వచ్చేశాడు.. టీమిండియాను కలిశాడు. ఎడ్జ్బాస్టన్ టెస్ట్ మ్యాచ్ తరువాత భారత జట్టు ఆడబోయే అన్ని మ్యాచ్లకూ రోహిత్ శర్మ అందుబాటులో ఉండబోతోన్నాడు. టెస్ట్ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానుంది. మూడు మ్యాచ్ల సిరీస్ ఇది.
ఈ నెల 7వ తేదీన తొలి టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ను ఢీ కొట్టబోయే జట్టుకు..రోహిత్ శర్మ కేప్టెన్గా ఉండబోతోన్నాడు. సౌథాంప్టన్లోని ఏజెస్ బౌల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 9, 10వ తేదీల్లో ఎడ్జ్బాస్టన్, ట్రెంట్ బ్రిడ్జ్ల్లో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి. దీని తరువాత ఇంగ్లాండ్తో రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడుతుంది టీమిండియా.
ఈ సిరీస్ల కోసం రోహిత్ శర్మ సిద్ధమౌతున్నాడు. నెట్ ప్రాక్టీస్లో పాల్గొంటున్నాడు. కఠోరంగా శ్రమిస్తోన్నాడు. ఇప్పటికే టెస్ట్ మ్యాచ్కు దూరమైన నేపథ్యంలో ఆకలిగొన్న పులిలా కనిపిస్తోన్నాడు రోహిత్ శర్మ. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించడానికి రెడీ అవుతున్నాడు. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా.. తనదైన ట్రేడ్ మార్క్ షాట్లను ఆడుతూ కనిపించాడు. ఆడబోయేది కూడా టీ20 మ్యాచ్ కావడం వల్ల బౌలర్లపై విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోంది.
తొలి టీ20 మ్యాచ్ కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది కూడా. దీనికి రోహిత్ శర్మ కేప్టెన్. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ సెలెక్ట్ అయ్యారు.