
చెన్నై: ఎంఎస్ ధోనీ.. ఈ పేరు వింటేనే ఎదో తెలియని వైబ్రేషన్ మొదలవుతుంది. ఛేజింగ్లో ధోనీ ఉన్నాడంటే.. భారత్ విజయం సాధిస్తుందని ఓ సగటు అభిమాని ధీమా. వికెట్ల వెనుక మహీ నిల్చున్నాడంటే.. ప్రత్యర్థి పనైపోయినట్లేనని భరోసా. సారథిగా వ్యూహం పన్నాడంటే.. మ్యాచ్ మనదే అన్న నమ్మకం. అంతలా ధోనీ ప్రభావం చూపాడు. దశాబ్దంన్నర పాటు అశేష అభిమానుల మనసులు గెలిచిన ధోనీ.. ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికాడు. చడీచప్పుడు లేకుండా టెస్టు క్రికెట్కు దూరమైన మహీ.. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కూడా ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండానే తప్పుకున్నాడు. దీంతో అనేకమంది తాజా, మాజీ క్రికెటర్లు ధోనీతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
అభిమానులు కూడా 16 ఏళ్ల పాటు ఎంఎస్ ధోనీ భారత క్రికెట్ జట్టుకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కొందరు ఫాన్స్ మహీ విషయం తెలిసి ఏడ్చారు కూడా. అయితే తమిళనాడుకు చెందిన ఓ చేనేత కళాకారుడు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. ఈరోడ్ జిల్లా చెన్నిమలైకి చెందిన అప్పుస్వామి.. 15 రోజులు కష్టపడి మగ్గంపై ధోనీ, ఆయన కూతురు జీవా చిత్రాలతో కూడిన ఓ దుప్పటిని రూపొందించాడు. ఆ దుప్పటిపై 'తల' అనే తమిళ పదాన్ని ఆంగ్లంలో పొందుపరిచాడు.
గతంలో ఎంతో మంది ప్రముఖుల చిత్రాలను దుప్పట్లపై డిజైన్ చేసి గుర్తింపు పొందిన అప్పుస్వామి.. తన అద్భుత కళ ద్వారా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోనీపై తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఐపీఎల్ కోసం యూఈఏ వెళ్లిన ధోనీ.. భారత్ తిరిగి వచ్చిన తర్వాత తానే స్వయంగా ఆ కళాఖండాన్ని మహీకి అందిస్తానని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ కెరీర్లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్ మ్యాచ్ల్లో 4,876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్ల్లో 10,773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ20 మ్యాచ్లలో 1,600 పరుగుల బాదాడు. రెండు అర్థ శతకాలు నమోదు చేశాడు. ఇక 190 ఐపీఎల్ మ్యాచులలో 4432రన్స్ చేశాడు.
దాదాపు 16 ఏళ్ళ పాటు భారత జట్టుకు ఎంఎస్ ధోనీ సేవలు అందించాడు. మూడు ఫార్మాట్లలో కూడా టీమిండియాకు ధోనీ అన్ని విధాలుగా తన బాధ్యతలు నిర్వహించి మంచి విజయాలు అందించాడు. 2007లో టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ (2011)తో పాటు 2013లో చాంపియన్ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్గా నిలిచిపోయాడు.