ఐపీఎల్తో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వాలనుకున్న ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. సూర్యకుమార్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని ఎన్సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ)ప్రకటించింది. స్పోర్ట్స్ హెర్నీయా సర్జరీ చేయించుకున్న సూర్య ఆటకు దూరమై మూడు నెలలు దాటింది.
క్రమంగా కోలుకున్న సూర్య ఫిట్నెస్ కోసం తీవ్రంగా శ్రమించాడు. ఎన్సీఏ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం మంగళవారం టెస్టుకు హాజరయ్యాడు. కానీ విఫలమయ్యాడు. దీంతో బాధతో సోషల్ మీడియాలో సూర్య హార్ట్ బ్రేక్ సింబల్ పోస్ట్ చేశాడు. సూర్య హార్ట్ బ్రేక్ ఎమోజీ పెట్టడానికి కారణం తెలియక తన ఫ్యాన్స్ తొలుత కంగారుపడ్డారు. సూర్య కుటుంబంలో ఏమైనా విషాదం జరిగిందా అని ఆరా తీశారు. కానీ ఎన్సీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తర్వాత తెలిసింది.

రేపు మరోసారి సూర్య ఫిట్నెస్ టెస్టుకు హాజరుకానున్నాడు. అయితే ఈ టెన్షన్లో సూర్యకుమార్కు ఓ గుడ్న్యూస్. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. మూడు నెలలు దూరమైనా అతడి రేటింగ్ పాయింట్ల దరికి ఏ ఆటగాడు కూడా చేరలేదు. మరికొన్ని నెలలు సూర్య ఆటకు దూరమైనా ఇప్పట్లో అతడి స్థానాన్ని ఎవరూ దక్కించుకోలేని స్థితిలో ఉన్నాడు.
861 రేటింగ్ పాయింట్లతో సూర్యకుమార్ ఫస్ట్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ 802 పాయింట్లతో ఉన్నాడు. సూర్యకు సాల్ట్ మధ్య 59 పాయింట్ల వ్యత్యాసం ఉండటం గమనార్హం. టాప్-10లో భారత్ తరఫున యశస్వీ జైస్వాల్ (6వ ర్యాంక్) ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ టాప్-10లోకి దూసుకొచ్చాడు. నాలుగు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరాడు. సర్జరీ తర్వాత ఐర్లాండ్ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చిన రషీద్ సత్తాచాటాడు. ఆల్రౌండర్ షోతో జట్టును గెలిపించాడు.
కాగా, మార్చి 22న ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మార్చి 24న ముంబై తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ లోపు ఫిట్నెస్ సాధించాలని సూర్య శ్రమిస్తున్నాడు.