
లండన్: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ టీవీ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్పై బీమర్ను సంధించాడో అభిమాని. ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ రాశాడు. ఆ లేఖ ప్రతులను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం సంజయ్ మంజ్రేకర్ ఐసీసీ తరఫున అధికారిక టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచకప్ టోర్నమెంట్ సందర్భంగా భారత్ ఆడుతున్న మ్యాచ్ల్లో సంజయ్ మంజ్రేకర్ టీమిండియాకు మద్దతుగా వ్యాఖ్యానిస్తున్నారనేది ఆయనపై వచ్చిన ఆరోపణ. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నివసిస్తోన్న ప్రవాస భారతీయుడు, క్రికెట్ అభిమాని ఎడ్డీ కుమార్ అనే వ్యక్తి సంజయ్ మంజ్రేకర్పై ఐసీసీకి ఫిర్యాదు చేశాడు.
ఐసీసీ తరఫున అధికారిక వ్యాఖ్యాతగా వ్యవహిరిస్తున్న సంజయ్ మంజ్రేకర్కు భారత క్రికెట్ జట్టు పట్ల పక్షపాతం చూపుతున్నారని, ఆ జట్టుకు అనుకూలంగా వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. ప్రపంచకప్ టోర్నమెంట్ సందర్భంగా ఇటీవల టీమిండిన ఆడిన మ్యాచుల సందర్భంగా సంజయ్ మంజ్రేకర్ పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించినట్లు ఎడ్డీ కుమార్ ఆరోపించారు.
ఓ మ్యాచ్ సందర్భంగా సంజయ్ మంజ్రేకర్ టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీని ఉద్దేశించి- హి ఈజ్ అవర్ వాచ్ డాగ్ బిహైండ్ ద స్టంప్స్.. అని కామెంట్ చేశారు. ఇందులో అవర్ పదం పట్ల ఎడ్డీకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐసీసీ అధికారిక కామెంటేటర్గా వ్యవహరిస్తున్న వ్యక్తి అజ్, అవర్ అనే పదాలను వినియోగించకూడదని అన్నారు. ఆటగాళ్ల పట్ల పర, తమ అనే భేదాలు ఉండకూడదని ఐసీసీ నిబంధనలు సూచిస్తున్నాయని, దీనికి భిన్నంగా సంజయ్ మంజ్రేకర్.. ధోనీని ఉద్దేశించి అతను మా (అవర్) ఆటగాడు.. అని సంబోధించడం సరికాదని అన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐసీసీకి లేఖ రాశాడు.