
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్లో పోరాడి ఓడింది. ఈ మ్యాచ్లో బ్యాట్స్ మెన్లు రాణించకపోయినా బౌలర్లు మాత్రం అదరగొట్టేశారు. కాగా, జట్టు మొత్తంలో పాండ్యా అద్వితీయ ప్రదర్శన చేసి ప్రత్యేక గుర్తింపును పొందాడు. భారత యువ ఆటగాడైన హార్దిక్ పాండ్య తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
జట్టు పీకల్లోతూ కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్కు దిగిన పాండ్య చూడముచ్చటైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మొదటి ఇన్నింగ్స్లో 93 పరుగులతో పాటు ఒక వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లను దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా పాండ్యా తన ఆట గురించి కాసేపు ముచ్చటించాడు.
'నా ప్రదర్శన ద్వారా జట్టుకు మేలు జరుగుతుందంటే అంతకన్నా ఇంకేం కావాలి. నేను క్రీజులోకి దిగిన సమయంలో భువనేశ్వర్ నాకు అండగా నిలిచాడు. ఈ క్రెడిట్లో అతనికీ భాగముంది. కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్కు దిగిన ఏ ఆటగాడైనా పరిస్థితిని చక్కదిద్దేందుకే ఆడతాడు.' అని అభిప్రాయపడ్డాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, బ్యాటింగ్కు దిగుతున్నప్పుడే తెలుసు వికెట్ కాపాడుకుంటూ భాగస్వామ్యాన్ని నెలకొల్పాలన్నాడు. కానీ, అప్పటికే దురదృష్టవశాత్తూ రెండు వికెట్లు పడిపోయాయి. దీంతో ఇక వేగంగా ఆడి వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టి జట్టు స్కోరు పెంచాలనున్నాను. నేనెప్పుడూ వ్యక్తిగతంగా పేరు తెచ్చుకోవటానికి స్కోర్లు సాధించలేదు. నా లక్ష్యం ఒకటే. జట్టు స్కోరు 250 దాటించాలని. ఈ సమయంలో శతకం గురించి కూడా ఆలోచించలేదు' అని పాండ్య తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.