రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ దాదాపు ఏడాది నుంచి క్రికెట్ కు దూరమయ్యాడు. సర్జరీ చేయించుకున్న అనంతరం నడవడానికే కష్టపడిన పంత్.. పరుగులు పెట్టేలా కోలుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని NCAలో కోలుకుంటున్నాడు. ఫిబ్రవరిలోపు పూర్తి ఫిట్ నెస్ సాధించేలా పంత్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో తిరిగి టీమిండియాలో చోటు సంపాదించాలంటే పంత్ ఐపీఎల్ లో తప్పక సత్తాచాటాలి. మరోవైపు పంత్ పై దిల్లీ క్యాపిటల్స్ ఎన్నో అంచనాలు పెట్టుకుంది. వచ్చే సీజన్ కు పంత్ కెప్టెన్ అని ఆ జట్టు మేనేజ్మెంట్ కూడా ధ్రువీకరించింది. అయితే పంత్ ఐపీఎల్ లో ఆడాలో వద్దా అనేది NCA నివేదికతో బీసీసీఐ నిర్ణయించనుంది.

అయితే దిల్లీ క్యాపిటల్స్ మరో ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ అనుమతిస్తే పంత్ తో వికెట్ కీపింగ్ చేయించాలని, లేదంటే ఫీల్డింగ్ చేయించాలని చూస్తుంది. ''అతడు వికెట్ కీపింగ్ చేయకపోతే ఫీల్డర్ గా మైదానంలో ఉంటూ జట్టును నడపిస్తాడు'' అని దిల్లీ ఫ్రాంచైజీ అధికారులు పేర్కొన్నారు. పంత్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గానూ తీసుకునే ఛాన్స్ లు కూడా లేకపోలేదు.
గాయంతో పంత్ దూరమవ్వడంతో ఐపీఎల్-2023 సీజన్ లో దిల్లీ క్యాపిటల్స్ ను డేవిడ్ వార్నర్ నడిపించాడు. అయితే ఈ సీజన్ లో దిల్లీ పేలవ ప్రదర్శన చేసింది. పాయింట్స్ టేబుల్ లో ఆఖరి నుంచి రెండో స్థానానికి పడిపోయింది.
కాగా, ఈ ఏడాది జనవరి నుంచి పంత్ టీమిండియా ఆడిన 62 మ్యాచ్ లకు దూరమయ్యాడు. అలాగే అఫ్గానిస్థాన్ తో జరగనున్న టీ20 సిరీస్ తో పాటు ఇంగ్లాండ్ తో జరిగే అయిదు టెస్టుల సిరీస్ కు పంత్ దూరం కానున్నాడు.