India vs Sri Lanka: కోచ్ ప్రధాన బాధ్యత అదే.. ద్రవిడ్ ఆ పని చేయగలడు: సచిన్

ముంబై: ఆటగాళ్ల మధ్య ఆరోగ్యకరమైన వాతవరణం ఉండేటట్లు చూడటమే కోచ్ ప్రధాన బాధ్యత అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్, భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆ పనిని సమర్ధవంతగా చేయగలడన్నారు. జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా బీసీసీఐ ఇటీవలే భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో.. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యంలో టీమిండియా రెండో జట్టు లంకతో సిరీస్ ఆడనుంది. శ్రీలంక పర్యటనలో భారత్కు ద్రవిడ్ కోచ్గా వ్యవహరించనున్నారు.
తాజాగా సచిన్ టెండూల్కర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత యువ ఆటగాళ్లు గతంలో రాహుల్ ద్రవిడ్తో కలిసి పనిచేశారు. జట్టులోని ఆటగాళ్ల మధ్య, డ్రెస్సింగ్ రూమ్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూడటం కోచ్ ప్రధాన బాధ్యత. ద్రవిడ్ ఆ పని చేస్తాడు. ఈ బలహీనత ఉన్నవారు ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వవలసిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి కోచ్ పదవికి అనర్హుడు' అని అన్నారు. 'కోచ్ అంటే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఎవరైనా సరిగా ఆడకుంటే వారికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీరందరికీ కవర్ డ్రైవ్ ఎలా ఆడాలో, ఔట్ స్వింగ్ను ఎలా కొట్టాలో తెలుసు' అని పేర్కొన్నారు.
శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన జట్టు గురించి సచిన్ టెండూల్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీనియర్లు, జూనియర్లతో జట్టు సమతూకంగా ఉందన్నారు. రాహుల్ ద్రవిడ్ వారికి కోచ్గా వ్యవహరించడం మరొక అదనపు ప్రయోజనమని పేర్కొన్నారు. శిఖర్ ధావన్ వంటి అనుభవజ్ఞున్ని కెప్టెన్గా ఎంపిక చేయడం జట్టుకు కలిసొస్తుందని సచిన్ చెప్పారు. 2015 నుంచి ఇండియా-ఏతో పాటు అండర్-19 జట్లకు కోచ్గా పనిచేసిన ద్రవిడ్.. 2019లో జాతీయ క్రికెట్ అకాడమీకి చీఫ్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం శ్రీలంక పర్యటన రూపంలో తొలిసారి జాతీయ జట్టుకు కోచ్గా వ్యవహరించనున్నారు.
శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. నిజానికి ఈ పరిమిత ఓవర్ల సిరీసు గతంలో ఆడాల్సింది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రత్యామ్నాయ ఆటగాళ్లు, టీ20 స్టార్లు అందుబాటులో ఉండటంతో.. ఆ పర్యటనను బీసీసీఐ ఇప్పుడు ఖరారు చేసింది. ఇటీవలే ముంబైకి చేరుకున్న ధావన్ సేన అక్కడ హోటల్లో 14 రోజుల క్వారంటైన్లో ఉంది. అనంతరం ఛార్టర్ ప్లైట్లో లంకకి వెళ్తుంది. అక్కడికి చేరుకున్నాక శిక్షణకు ముందు మళ్లీ మూడు రోజుల పాటు.. జులై 4 వరకు హార్డ్ క్వారంటైన్లో ఉంటారు. అనంతరం జులై 12వరకు బయోబబుల్లో ట్రైనింగ్ అవుతారు. ఆపై ఇంట్రా స్క్వాడ్ గేమ్స్ ఆడతారు.
భారత జట్టు:
శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications