ముంబై: ఐపియల్ ఫైనల్ మ్యాచ్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో వేదికపై ఓ అందమైన యువతి దర్శనమిచ్చింది.. ఎవరా అందాలరాశి అని ప్రతి ఒక్కరూ ఆలోచించే ఉంటారు. ఫైనల్ మ్యాచ్ బహుమతి ప్రదానోత్సవంలో తళుక్కున మెరిసి అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె ఐపీఎల్కు ప్రధాన స్పాన్సర్లలో ఒకటైన యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, సీఈవో రాణా కపూర్ ముద్దల తనయ. పేరు రాఖీ టాండన్. ఆ హోదాలోనే ప్రదానోత్సవానికి హాజరై విజేతలకు బహుమతులను అందించింది.
ఆ రోజు మ్యాచ్లో ప్రముఖ క్రికెటర్లను ఒకే వేదికపై చూసి కుర్ర అభిమానులు ఎంత సంతోషించారో తెలియదుగానీ, మోముపై చిరు మందహాసాన్ని చిందిస్తూ బిగ్ స్క్రీన్, టీవీల్లో ప్రత్యక్షమైన ఆమెను చూసిన వారు మాత్రం చూపులు తిప్పుకోలేకపోయారు.

దాన్ని ధ్రువీకరిస్తూ సాక్షాత్తూ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా ఆమె అందానికి ముగ్దుడై తన అంతరంగాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు. రాఖీ టాండన్.. క్యూటెస్ట్ గాళ్ ఆఫ్ ఐపీఎల్. ఆమె ఈ రోజు అబ్బాయిలందరి హృదయాలను దోచేసింది అంటూ జడేజా ట్వీట్ చేశాడు.
విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసుకొచ్చిన ఈ మహిళ సొంతంగా రెండు వ్యాపార సంస్థలనూ నడుపుతోంది. అయితే, ఆమె సింగిల్ వుమెన్ కాదు, దుబాయ్కు చెందిన ఓ వ్యాపార వేత్తను వివాహమాడింది. కాగా, సోమవారం నుంచీ ఆమె పేరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రాఖీ కపూర్ టాండన్ అంతకు ముందు ఎవరికీ తెలియదు. ఒక్కసారిగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కనిపించే సరికి ఎవరీమె అంటూ ఆసక్తితో ప్రశ్నించుకున్నారు.