
కోవిడ్ -19 వ్యాప్తి తీవ్రంగా తగ్గుముఖం పట్టడంతో స్టేడియంలలోకి 100శాతం ప్రేక్షకులను బీససీఐ అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోవిడ్ వెలుగుచూసిన తర్వాత తొలిసారిగా 100శాతం ఆక్యుపెన్సీతో ఇంటర్నేషనల్ సిరీస్ నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధమైంది. టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగే సిరీస్ కోసం ఫుల్ కెపాసిటీ మేరకు స్టేడియాల్లోకి ప్రేక్షకులు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఈ సిరీస్లో భాగంగా ఢిల్లీలో జరగబోయే మొదటి టీ20 కోసం 94శాతం టిక్కెట్లు అమ్ముడయ్యాయి. జూన్ 9న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 35,000మందితో సిరీస్ ఓపెనర్ మ్యాచ్ జరగనుంది. 2019తర్వాత ఈ వేదికపై తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగబోతుంది.
దీంతో అభిమానులు మ్యాచ్ చూడ్డానికి అమితాసక్తి కనబర్చారు. అందుకే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇక టీ20 ప్రపంచ కప్ ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న క్రమంలో భారత జట్టు కూర్పును, ప్రదర్శనను మెరుగుపర్చుకునే నిమిత్తం ఈ సిరీస్ను ఓ ముందస్తు అవకాశంగా టీమిండియా భావిస్తోంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లు ఈ సిరీస్కు అందుబాటులో లేకపోవడంతో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇక ఐపీఎల్లో రాణించిన కొందరు ప్లేయర్లు కూడా ఈ సిరీస్కు సెలెక్ట్ అయ్యారు. ఐపీఎల్లో ఆకట్టుకున్న అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ తొలిసారి టీమిండియా జట్టుకు ఎంపికయ్యారు.
ఇక తొలి టీ20 మ్యాచ్ విషయం గురించి ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రాజన్ మంచాండా మాట్లాడుతూ.. తొలి మ్యాచ్కు ఇప్పటికే 94శాతం టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దాదాపు 400-500 టిక్కెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక అభిమానులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. సీనియర్ సిటిజన్లు స్టేడియంలోకి ప్రవేశించడానికి గోల్ఫ్ కార్ట్లను ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేశాం. అలాగే స్టేడియంలో మా సిబ్బందికి క్రమం తప్పకుండా కరోనా టెస్ట్లు చేస్తున్నాం. కోవిడ్ ప్రోటోకాల్లకు కట్టుబడి స్టేడియంలో అన్ని రకాల సదుపాయాలు ఏర్పాట్లు ఉన్నాయి. ఇక స్టేడియంలోకి వచ్చే అభిమానులను మాస్క్లు ధరించాలని మేము అభ్యర్థిస్తున్నాం.' అని ఆయన పేర్కొన్నారు.