సుందర్గఢ్: ఒడిశాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సూరపల్లి సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది కబడ్డీ క్రీడాకారులు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సుందర్గఢ్ జిల్లా సెందాపూర్ గ్రామానికి చెందిన కబడ్డీ జట్టు దుడియాగావ్లో జరిగిన ఓ టోర్నమెంట్లో పాల్గొని ఓ మినీ ట్రక్లో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాళ్లు ప్రయాణిస్తున్న ట్రక్ నది వంతెనపై నుంచి ప్రమాదవశాత్తు పడిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మరో ముగ్గురు చిక్సిత జరుగుతున్న సమయంలో కన్నుమూశారు. మిగితా 13మంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో కొందర్ని అభిరాం కాలో(50), ధరనింధార్ నాయక్(60), చంద్రశేఖర్ ప్రధాన్(18), గౌరి చంద్రకిస్సన్(22), ఉమేష్ కిస్సన్(25)లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలిపారు.
కాగా, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పవన్ పట్నాయక్ మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారు. మృతి చెందిన ప్రతీ ఒక్క బాధితుల కుటుంబానికి రూ. లక్ష అందజేయనున్నట్లు తెలిపారు.