
ప్రభుత్వం ప్రకటన
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. దీంతో రాష్ట్రంలో జరిగే అన్ని ఇండోర్, ఔట్ డోర్ గేమ్లకు 75% ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన 68 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న ఈడెన్గార్డెన్స్ స్టేడియంలోకి 50 వేల వరకు ప్రేక్షకులు రావడానికి అనుమతి వచ్చింది.
దీంతో అక్కడి క్రికెట్ అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. డిసెంబర్లో కోల్కతా వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్కు కూడా 50% మంది ప్రేక్షకులను అనుమితించారు. కాగా కోల్కతా వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య ఫిబ్రవరి 16, 18, 20వ తేదీలలో టీ20 సిరీస్ జరగనుంది.

ధన్యవాదాలు తెలిపిన దాల్మియా
ఇండియా, వెస్టిండీస్ టీ20 సిరీస్కు ప్రేక్షకులను అనుమతించినందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమబెంగాల్లోని క్రీడాకారులకు ప్రభుత్వం నిర్ణయం నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. అలాగే డిసెంబర్లో న్యూజిలాండ్తో జరిగిన టీ20 మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించామని, వెస్టిండీస్తో జరగనున్న టీ20 సిరీస్ను కూడా విజయవంతంగా నిర్వహిస్తామనే నమ్మకం ఉందని అవిషేక్ దాల్మియా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

3 మ్యాచ్లు అక్కడే
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వెస్టిండీస్తో భారత జట్టు ఆడాల్సిన 3 టీ20 మ్యాచ్లు కటక్, విశాఖపట్నం, తిరువనంతపురం వేదికగా జరగాల్సి ఉంది. కానీ కరోనా విజృంభణ కారణంగా బీసీసీఐ మూడు టీ20 మ్యాచ్లను కోల్కతాకే పరిమితం చేసింది. అలాగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా పాత షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్, కోల్కతా వేదికగా జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా బీసీసీఐ వేదికలను కుదించింది. వన్డే సిరీస్ను అహ్మదాబాద్కే మాత్రమే పరిమితం చేసి, టీ20 సిరీస్ను కోల్కతా వేదికగా నిర్వహిస్తోంది.

అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా
వన్డే సిరీస్ కోసం టీమిండియా సోమవారం అహ్మదాబాద్ చేరుకుంది. అక్కడ నేటి నుంచి 3 రోజుల పాటు క్వారంటైన్లో ఉండనుంది. 4 నుంచి ప్రాక్టీస్ మెదలుపెడుతుంది. ఇక 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. 9, 11వ తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండగా.. వెస్టిండీస్కు కీరన్ పొలార్డ్ కెప్టెన్గా ఉండనున్నాడు.


Click it and Unblock the Notifications












