
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ మ్యాచ్ల టైమింగ్స్ మార్పు తెలివైన నిర్ణయమని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2020కి భారత కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 19న ఆరంభమయ్యే మెగా టోర్నీ నవంబరు 10న ముగుస్తుంది. ఇంతకుముందు ఐపీఎల్ను కరోనా మహమ్మారి కారణంగా నిరవధికంగా వాయిదా వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. టీ20 ప్రపంచకప్ వాయిదా నేపథ్యంలో టోర్నీని యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 19న ప్రారంభమయ్యే ఐపీఎల్.. నవంబర్ 10 వరకు 53 రోజుల పాటు సాగనుంది. ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ నేతృత్వంలో తాజాగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకూ భారత కాలమానం ప్రకారం ఐపీఎల్ మ్యాచ్లు రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి. అయితే ఈ సారి మాత్రం అరగంట ముందుగా అంటే.. రా.7.30కే మ్యాచ్లు మొదలు పెట్టాలని పాలక మండలి నిర్ణయించింది. టోర్నీ మొత్తంలో కేవలం 10 డబుల్ హెడర్ ( రోజులో రెండు మ్యాచ్లు) మ్యాచ్లే ఉన్నాయి. ఒకే రోజు రెండు మ్యాచ్లు ఉన్నప్పుడు మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30గంటలకు ఆరంభం అవుతుంది.
ఐపీఎల్ మ్యాచ్ల టైమింగ్స్ మార్పుపై తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో ఆకాశ్ చోప్రా స్పందించాడు. 'ఐపీఎల్ మ్యాచ్లు రాత్రి 7.30 గంటలకే ప్రారంభమవనున్నాయి. మ్యాచ్ల టైమింగ్స్ మార్పు తెలివైన నిర్ణయం. 8 గంటలకి స్టార్ట్ అయ్యే మ్యాచ్లు సాధారణంగా రాత్రి 11.30 లేదా 11.45కి ముగుస్తాయి. దాంతో మ్యాచ్లు ఆఖరి వరకూ చూడటం కొంత మందికి ఇబ్బందే. ఇప్పుడు మాత్రం 11. 00కే ముగిసే అవకాశం ఉంది' అని ఆకాశ్ అన్నాడు. అర్ధరాత్రి ముగిసే మ్యాచ్లకి వ్యూవర్షిప్ తగ్గిపోతోందని ఇటీవల ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబి వేదికగా ఈ ఏడాది టోర్నీ జరుగనుంది. కాగా కరోనా వైరస్ ప్రభావం ఏ మాత్రం పడకుండా లేకుండా ఐపీఎల్ కోసం బీసీసీఐ బయో సెక్యూర్ వాతావరణాన్ని సృష్టించనుంది. ఐపీఎల్ కోసం వెళ్లేవారంతా వెళ్లిన రోజు నుంచే బయోబబుల్లో ఉండనున్నారు. కాగా ఒక్కో ఫ్రాంచైజీ తరఫున గరిష్ఠంగా 24మంది ఆటగాళ్లను తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతించింది.
ఆగస్టు రెండో వారంలోనే ఆటగాళ్లు, సిబ్బందిని ఫ్రాంచైజీలు యూఏఈకి తీసుకెళ్లాలని మొదటగా జట్టు యాజమాన్యాలు ఆలోచించాయి. అయితే ప్రయాణాన్ని వారం పాటు ఆలస్యం చేసుకోవాలని ఐపీఎల్ పాలక మండలి సూచించింది. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని ప్రొటోకాల్స్ పాటించి, పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసేందుకు సమయం పడుతుందని భావించిన సీజీ.. ఫ్రాంచైజీలకు సూచనలు చేసింది. దీంతో ఐపీఎల్ కోసం ఆగస్టు 20వ తేదీలోగా ఆటగాళ్లు యూఏఈకి వెళ్లనున్నారు.